రోజు కూలీ ఖాతాలో రూ. ఒక కోటి: షాకిచ్చారు
లుథియానా: ఆదాయపన్ను శాఖ అధికారులు పంజాబ్ లో ఒకరికి చుక్కలు చూపించారు. వెంటనే రూ. 40 లక్షలు ఆదాయపు పన్ను కట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు పంపించారు. అయితే నోటీసులు అందుకుంది పారిశ్రామిక వేత్త కాదు, సాఫ్ట్ వేర్ ఇంజనీరు అంతకంటే కాదు.
ఓ రోజువారి కూలీకి నోటీసులు వెళ్లాయి. ఆకూలీ బ్యాంకు ఖాతాలో రూ. ఒక కోటి డిపాజిట్ ఉందని ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న ఆ రోజువారి కూలీ కంగుతిన్నాడు. నెలకు రూ. 8 వేల సంపాదనతో నెట్టుకొస్తున్న తనకు బ్యాంకు ఖాతానే లేదని అంటున్నాడు.
తానకు ఇంత వరకు బ్యాంకు ఖాతా లేదని, తాను ఎప్పుడు బ్యాంకులో నగదు డిపాజిట్ చెయ్యలేదని, కనీసం బ్యాంకులో అడుగు పెట్టలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పన్ను ఎగవేసేందుకు కొంత మంది అక్రమార్కులు షాడో బ్యాంకు ఖతాలు తెరుస్తున్నారని అధికారులు గుర్తించారు.
పేదల గుర్తింపు కార్డులు, నివాస పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నారని ఐటీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇలాంటి షాడో బ్యాంకు అకౌంట్ లో పంజాబ్ లో అధికమయ్యాయని అధికారులు అంటున్నారు.
హవాల సొమ్ము, తీవ్రవాదులకు నిధులు ఇలాంటి షాడో బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హవాలా ఆపరేటర్లు, పన్ను ఎగవేత దారులు, బ్యాంకు అధికారుల మీద ఐటీ అధికారులు నిఘా వేశారు. బ్యాంకు అధికారుల మీద వచ్చిన ఫిర్యాదులను ఆర్ బీఐకి పంపిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు.