ఆప్తోనే అవినీతి పాలనకు అంతం.. పంజాబ్కు నిజాయితీగల సీఎంను అవసరం : కేజ్రివాల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ దూకుడును మరింత పెంచాయి. పోలింగ్ తేది దగ్గర పడుతున్న కొద్ది ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ హీట్ పెంచుతున్నాయి. సై అంటే సై అంటూ ఎన్నికల సమరంలో కాలుదువ్వుతున్నాయి. అధికారమే లక్ష్యంగా తమ వ్యూహలకు పదును పెడుతున్నాయి.
పంజాబ్లో పాగాకు ఆప్ వ్యూహం
అధికార కాంగ్రెస్ మరో సారి తమ కుర్చీని పదిలం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అటు ఎలాగైనా పంజాబ్లో పాగా వేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తమ సీఎం అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. తాజాగా ఆప్ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజివాల్ పంజాబ్లో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఫిల్లౌర్ లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఒకవైపు అవినీతి పరులు .. మరోవైపు నిజాయితీపరుడు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కాంగ్రెస్ , బీజేపీలపై అరవింద్ కేజ్రివాల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. వారి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒకవైపు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పపడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నావారు ఉన్నారు. మరో వైపు ఎప్పుడూ ఎవరి నుంచి ఒక 25 పైసలు కూడా తీసుకోని వ్యక్తి పోటీలో ఉన్నారని కేజ్రివాల్ పేర్కొన్నారు.
పంజాబ్కు నిజాయితీగల సీఎం అవసరం
పంజాబ్కు నిజాయితీ గల ముఖ్యమంత్రిని అవసరమని కేజ్రివాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నిజాయితీపరుడని ఈసందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రజలు ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఏపార్టీకి ఓటేస్తే నిజాయిపడైన ముఖ్యమంత్రి అవుతాడో ఆలోచించి తమ ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేజ్రివాల్. దేశాన్ని బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని విమర్శలు గుప్పించారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చిందని .. ఎన్నికల కోసమే వాటిని ఉపసంహరించుకుని లబ్దిపోందేందుకు కుట్ర చేస్తుందని ఆరోపణలు గుప్పించారు.