కాంగ్రెస్ను నిండా ముంచిన నవ్జోత్ సిద్ధు: కొట్లాడి తెచ్చుకున్న పీసీసీ చీఫ్ పోస్ట్కు రాజీనామా
చండీగఢ్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి హైఓల్టేజ్ డబుల్ షాక్ తగిలింది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన కేప్టెన్ అమరీందర్ సింగ్.. భారతీయ జనతా పార్టీలో చేరబోతోన్నారంటూ ప్రచారం ఊపందుకోవడం, ఆయన హస్తిన బాట పట్టడం ఒక ఎత్తయితే.. ఆ వెంటనే- నవ్జోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేయడం మరో ఎత్తు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు నవ్జోత్.
సోనియాకు రాజీనామా లేఖ..
తన రాజీనామా పత్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పంజాబ్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పంజాబ్ ప్రజల సంక్షేమానికి అజెండాకు నష్టం వాటిల్లే ప్రయత్నాలను తాను ఏ మాత్రం కూడా సహించబోనని అన్నారు. తన వ్యక్తిత్వంపై దాడి జరుగుతున్నప్పటికీ.. సహించానని, రాజీపడ్డానని చెప్పారు.
పంజాబ్ క్షేమం కోసమే..
పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమ అజెండా విషయంలో తాను ఏ మాత్రం రాజీపడదలచుకోలేదని నవ్జోత్ సింగ్ సిద్ధు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి వరుసలో ఉంటుంది. కేప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలో ఇదివరకు వరుస విజయాలను అందుకుంది హస్తం పార్టీ. 117 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ధాటికి భారతీయ జనతా పార్టీ-దాని మిత్రపక్షాలు చిత్తు చిత్తయ్యాయి. ఆమ్ ఆద్మీ 20 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
అమరీందర్ సింగ్ ప్రయత్నాలు చేసినా..
ఇంత బలంగా ఉన్న పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళం పడినట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నవ్జోత్ సిద్ధును నియమించింది పార్టీ అధిష్ఠానం. ఈ పదవి కోసం ఆయన చాలా పోరాటం చేశారు. అసమ్మతి నేతలను బుజ్జిగించారు. అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. నవ్జోత్కు పీసీసీ చీఫ్ పదవి రాకుండా తన శక్తివంచన లేకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ- సిద్ధు సిక్సర్ల ముందు ఆయన ప్రయత్నాలేవీ నిలవలేకపోయాయి.
అన్నీ సర్దుకున్నాయనుకునే లోపే..
పంజాబ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను నవ్జోత్ను అప్పగించిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రిని కూడా మార్చివేసింది కాంగ్రెస్ హైకమాండ్. కేప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించింది. ఆయన స్థానంలో చరణ్జిత్ సింగ్ ఛన్నీని అపాయింట్ చేసింది. సోమవారమే ఆయన తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే- రెండు షాకింగ్ విషయాలను చవి చూడాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి.
నవ్జోత్ రాజీనామా వెనుక..
ఒకవంక- పీసీసీ అధ్యక్ష స్థానంలో నవ్జోత్ సింగ్ సిద్ధు.. మరోవంక కొత్త ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీ సారథ్యంలో- ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమౌతోన్న వేళ.. ఊహించని విధంగా హైఓల్టేజ్ షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్.. బీజేపీలో చేరబోతోన్నారంటూ ప్రచారం ఊపందుకోవడం, ఆయన హస్తినకు ప్రయాణం కట్టిన కొద్దినిమిషాల్లోనే నవ్జోత్ సింగ్ సిద్ధు తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
బీజేపీకి అనుకూలంగా..
అమరీందర్ సింగ్ను బుజ్జగించే చర్యల్లో భాగంగానే నవ్జోత్ సింగ్ సిద్ధు తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. దీన్ని ఎవరూ ధృవీకరించలేదు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతోన్న ఉద్యమంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు.
బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పంజాబ్లో మళ్లీ కాంగ్రెస్ సునాయాస్ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాంటప్పుడు నవ్జోత్ సింగ్ సిద్ధు హఠాత్తుగా రాజీనామా చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు పుంజుకోవడానికి అవకాశం కల్పించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.