పంజాబ్ పాలిటిక్స్ లో పాకిస్తాన్ జర్నలిస్ట్- అరూసా ఆలమ్ కలకలం- టార్గెట్ అమరీందర్
నాలుగు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పంజాబా్ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ తప్పించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ చుట్టూ ఇక్కడి రాజకీయాలు తిరుగుతున్నాయి. అందులోనూ ఆయన కొత్త పార్టీ స్ధాపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్ధులు ఆయన్ను పలు విధాలుగా టార్గెట్ చెస్తున్నారు.
పంజాబ్ లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ త్వరలో కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆయనకు కాంగ్రెస్ లో ఉన్న మద్దతుదారుల్ని కలుపుకుని ఈ పార్టీని స్ధాపించబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. తనను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి పరాభవాన్ని చవిచూపించే లక్ష్యంతో అమరీందర్ అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో అమరీందర్ సన్నిహితురాలు, పాకిస్తానీ జర్నలిస్ట్ అరూసా ఆలం పేరు తెరపైకి వస్తోంది.
అరూసా ఆలంను టార్గెట్ చేస్తూ పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రణ్ ధావా తాజాగా చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అరూసా ఆలంకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్ధ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని రణ్ ధావా ఆరోపించారు. దీంతో దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అరూసా ఆలంపై దర్యాప్తు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆరూసా ఆలంతో అమరీందర్ సంబధాలపైనా విచారణ జరుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో అరూసా ఆలం వ్యవహారం ఇప్పుుడు పంజాబ్ కాంగ్రెస్ ను కుదిపేసేలా కనిపిస్తోంది.
మరోవైపు తనను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ముందే గ్రహించిన అమరీందర్ సింగ్ మౌనాన్నే ాశ్రయిస్తున్నారు. ఇవాళ కూడా త్వరలో తాను పార్టీ పెడతానని మాత్రమే చెప్పిన అమరీందర్.. దానికి ఇంకా పేరు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు కేంద్రంలోని బీజేపీతో సంబంధాలు కోరుకుంటున్న అమరీందర్.. ఎన్నికల తర్వాత ఇరువురూ కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసేలా పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అరూసాపై ప్రత్యర్ధుల దాడిని పసిగట్టిన అమరీందర్.. తాజాగా బీజేపీ అగ్ర నేతలతోనూ ఆమె కలిస్తుున్న డజను ఫొటోల్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. తద్వారా తాను బీజేపీకి కూడా కావాల్సిన వ్యక్తే అనే సందేశం పంపారు.