ర్యాడికో ఖైతాన్ కు భారీ ఊరట
రాడికో ఖైతాన్కు పంజాబ్, హర్యానా హైకోర్టు ఊరటనిచ్చింది. పికాడిల్లీ ఆగ్రో లిమిటెడ్తో కొనసాగుతున్న ట్రేడ్మార్క్ వివాదంలో భాగంగా 'కశ్మీర్' అనే లేబుల్ను తమ వోడ్కా బ్రాండ్కు ఉపయోగించుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ట్రేడ్మార్క్ వినియోగంపై గతంలో విధించిన నిషేధాన్ని రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాడికో ఖైతాన్ తమ ప్రీమియం 'ది స్పిరిట్ ఆఫ్ కశ్మీర్' వోడ్కా విక్రయాలను ఇక యధాతథంగా కొనసాగించవచ్చు.
కశ్మీర్ ట్రేడ్ మార్క్ ను రాడికో ఖైతాన్ వినియోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పికాడిల్లీ ఆగ్రో లిమిటెడ్ కర్నాల్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. పిటీషన్ దాఖలు చేసింది. ఈ లేబుల్ ను వినియోగించడం సరికాదని పేర్కొంది. 'కశ్మీర్' మార్క్ తమ సంస్థకు చెందిన రిజిస్టర్డ్ 'క్యాష్మిర్' ట్రేడ్మార్క్ను పోలి ఉందని పికాడిల్లీ ఆరోపించింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కర్నాల్ జిల్లా కోర్టు.. కిందటి నెలలో రాడికో ఖైతాన్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్ ట్రేడ్ మార్క్ ను వినియోగించడాన్ని నిషేధించింది.

దీన్ని రాడికో సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు హర్యానాలో తప్పుగా దాఖలయిందని, తాము ఆ రాష్ట్రంలో ఎటువంటి కార్యకలాపాలు చేయట్లేదని, అక్కడ వోడ్కా ఉత్పత్తి చేయడం గానీ, విక్రయించడం గానీ తమ వాణిజ్య కార్యకలాపాల్లో లేదని వివరించింది. దీనికి ఎక్సైజ్ లైసెన్స్ తమకు లేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది మేలో ఉత్తరప్రదేశ్లో తమ లగ్జరీ వోడ్కా బ్రాండ్ను విడుదల చేసినట్లు రాడికో హైకోర్టుకు వివరించింది. "క్యాష్మిర్ వోడ్కా" ఉత్పత్తిని మే 23వ తేదీన ప్రకటించిందని, దానికి రెండు రోజుల ముందే తాము కశ్మీర్ ట్రేడ్ మార్క్ తో మార్కెట్లో అడుగుపెట్టామని వాదించింది. పికాడిల్లీ ఆగ్రో బ్రాండ్ ట్రేడ్ మార్క్ తో పోలిక లేదని, దీనివ్లల వినియోగదారుల్లో ఎటువంటి అయోమయం గానీ, గందరగోళం గానీ ఏర్పడలేదని రాడికో పేర్కొంది.
వాదనలను సమీక్షించిన తర్వాత.. రాడికో ఖైతాన్ వాణిజ్య కార్యకలాపాల పరిధి, హర్యానాలో ఆ సంస్థ వోడ్కా విక్రయించిందనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడాన్ని గుర్తించింది. పికాడిల్లీ ఆగ్రో వాదనలతో ఏకీభవించలేదు. దీనిపై సమగ్రంగా న్యాయ పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు పారదర్శక అమ్మకాల రికార్డులను నిర్వహించాలనే షరతుతో 'కశ్మీర్' లేబుల్ కింద వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి రాడికో ఖైతాన్కు అనుమతులు ఇచ్చింది.
పికాడిల్లీ కంటే ముందుగా కశ్మీర్ ట్రేడ్ మార్క్ తో మార్కెట్ లో అడుగుపెట్టడం, క్లియర్ బ్రాండింగ్, ప్రీమియం పొజిషనింగ్ తమ వోడ్కాను వినియోగదారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయని రాడికో వాదించింది. హైకోర్టు మధ్యంతర ఉపశమనం రాడికో ఖైతాన్తో భారీ ఊరట లభించినట్టయింది. ఇది- కంపెనీ లగ్జరీ స్పిరిట్స్ పోర్ట్ఫోలియోను విస్తరించడానికి, వోడ్కా డివిజన్ లో తన ఫస్ట్ మూవ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఊతమిచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications