కలకలం: ఢిల్లీ ఎయిర్పోర్టులో రేడియోధార్మిక లీకేజీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సరకు రవాణా టెర్మినల్లో రేడియో ధార్మికత లీక్ అవడం ఆదివారం కలకలం సృష్టించింది.
ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా టెర్మినల్కు చేరుకున్న ఓ వైద్యపరికరం నుంచి రేడియో ధార్మికత లీక్ అవుతున్నట్లు సిబ్బంది ఆదివారం ఉదయం గుర్తించారు. దీంతో టెర్మినల్లో అత్యవసర పరిస్థితిని విధించి.. అందరినీ బయటకు పంపించారు.
అణు ఇంధన క్రమబద్ధీకరణ బోర్డు(ఏఈఆర్బీ), జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారసంస్థ(ఎన్డీఎంఏ)లకు సమాచారం అందించారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఓ పదార్థం నుంచి లీకేజీ ఉందని అధికారులు గుర్తించారు.
ప్రయాణికుల రాకపోకలు జరిగే ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే సరకు రవాణా టెర్మినల్ ఉండటం గమనార్హం. అయితే, సదరు లీకేజీ పరిమితికి లోబడే ఉందని.. దాన్ని రేడియో ధార్మికత లీకేజీగా పరిగణించలేమని తేల్చారు. లీకేజీ కారణంగా ప్రమాదమేమీ లేదని స్పష్టంచేసిన అధికారులు.. అత్యవసర పరిస్థితిని రద్దుచేశారు.