మహిళా పైలెట్ల చేతుల్లోనూ రాఫెల్ యుద్ధ విమానాలు: 17వ స్క్వాడ్రన్లోకి ఫైటర్ పైలెట్స్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా, కీలకంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాలను మహిళా పైలెట్లు కూడా నడిపించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాఫెల్ స్క్వాడ్రన్లోకి మహిళా పైలెట్లను తీసుకోవడానికి అవసరమైన చర్యలను రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికోసం వైమానిక దళంలో ప్రస్తుతం పనిచేస్తోన్న వారిలో 10 మంది మహిళలను ఎంపిక చేశారని, ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తున్నారని సమాచారం. ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ఇండియాటుడే ఈ అంశంపై ఓ ప్రత్యేక కథనాన్ని పోస్ట్ చేసింది.
హర్యానాలోని అంబాలా కేంద్రంగా పనిచేస్తోన్న 17వ స్క్వాడ్రన్లోకి త్వరలోనే వారిని ఎంపిక చేస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దిరోజుల కిందటే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన ఫ్రాన్స్ సాయుధ బలగాల మంత్రి ఫ్లారెన్స్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో రాఫెల్ యుద్ధ విమానాలు లాంఛనప్రాయంగా వైమానిక దళంలో చేరాయి. వచ్చే మూడు నెలల కాలంలో మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి.
ప్రస్తుతం వైమానిక దళంలో అందుబాటులో ఉన్న వార్ ఎయిర్క్రాఫ్ట్లతో పోల్చుకుంటే.. రాఫెల్ అత్యాధునికమైనవి. దీన్ని నడిపించడానికి వాయుసేన పైలెట్లకు రక్షణశాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తోంది. బృందాల వారీగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే బృందంలోకి 10 మంది మహిళా వైమానిక దళ పైలెట్లను ఎంపిక చేసినట్లు ఇండియాటుడే తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం వారంతా శిక్షణలో ఉన్నారని, త్వరలోనే 17వ స్క్వాడ్రన్లోకి వారిని తీసుకుంటారని స్పష్టం చేసింది.
ఈ స్క్వాడ్రన్లోకి ఎంపికైన మహిళా పైలెట్లు మిగ్-21 బైసన్ జెట్ ఫైటర్లను నడపడంలో నిష్ణాతులుగా పేర్కొంది. భారత వైమానిక దళంలో మహిళా పైలెట్ల నియామకం 2016లో ఆరంభమైన విషయం తెలిసిందే. ఫ్లైట్ లెప్టినెంట్లు అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్.. వాయుసేనలో చేరిన మొట్టమొదటి మహిళా పైలెట్లుగా రికార్డు నెలకొల్పారు. క్రమంగా వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఇప్పటిదాకా 10 మందికి పైగా మహిళా పైలెట్లు ఉన్నారు. ప్రతి సంవత్సరమూ వారి నియామకాలు చేపట్టడానికి ఇదివరకే రక్షణమంత్రిత్వ శాఖ అనుమతులను జారీ చేసింది.