గ్రామీణంపై దృష్టి పెట్టండి: దేశ ఆర్థిక పరిస్థితిపై రఘురామ్ రాజన్ ఆందోళన
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుత వృద్ధిరేటు ఏమాత్రం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ప్రస్తుత గణాంకాలు ఆశాజనకంగా లేవని అన్నారు.
అంతేగాక, దేశ ఆర్థిక వ్యవస్థ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా సాగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చైనా నుంచి పరిశ్రమలు వియత్నాంకు తరలిపోతున్నాయని.. వాటిని ఆకర్షించేందుకు భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉందని రఘురాం రాజన్ అన్నారు.

వచ్చే బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువగా నిధులు కేటాయించాలని రఘురామ్ రాజన్ కేంద్రానికి సూచించారు. ఆర్థిక వృద్ధిరేటు 5శాతానికి మించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రముఖ మీడియా సంస్థ సీఎన్బీసీ ఇంటర్నేషనల్తో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్లోనూ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇదే విధంగా ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిరాశజనకంగా మారిందని అన్నారు. మోడీ ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని తెలిపారు. పోటీతత్వం పెంపొందించడం, దేశీయ సమర్థతను మెరుగుపర్చేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
దేశ ఆర్థిక వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ నిర్ణాయక వ్యవస్థలోనే కాక, సలహాలు ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్ తెలిపారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదని అన్నారు.
రాష్ట్రస్థాయిలో కాకుండా దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణాలు అయినా ఆర్థిక సరళీకరణను స్థిరంగా తీసుకెళ్లాయని తెలిపారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఆర్థిక మందగమనాన్ని అధికమించేందుకు ముందు దానిని ప్రణాళికను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనం ప్రస్తుతం మాత్రమే అనే ఆలోచన విడనాడాలని రఘురాం రాజన్ సూచించారు. విమర్శలను రాజకీయ కోణంలో చూడకూడదని సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications