రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..
రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య వార్ జరుగుతోంది. అదీ ఇంకా పీక్కి చేరింది. ఢిల్లీ పెద్దలకు తనపై కంప్లయింట్ చేశారని రఘురామ ఆరోపించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశారని ఆరోపించారు. రూ.43 వేల కోట్లు దోచిన కేసులు ఉన్న వాళ్లు తనపై ఆరోపణలు చేశారని వివరించారు. అన్ని అంశాలను పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని మండిపడ్డారు. దొంగలు అంతా కలిసి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి జులై 26వ తేదీన సీబీఐ కోర్టులో అన్నీ తేలతాయని స్పష్టం చేశారు.
తనపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ పెద్దలు అన్నీ తెలిసి తనకు ఎందుకు టికెట్ ఇచ్చారని వారిని నేరుగా ప్రశ్నించారు. తనపై తమిళనాడులో కేసులకు సీఎం జగన్, బాలశౌరి కారణమని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. విశాఖపట్టణాన్ని విజయసాయిరెడ్డి లూటీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. తనపై ఫిర్యాదు చేయడంతో.. తాను కంప్లయింట్ చేస్తానని చెప్పారు. కానీ తాను నేరుగా ఉన్న విషయాలను.. ఆధారాలతో సహా అందిస్తానని వివరించారు.