అమిత్ షా జోస్యం: 8చోట్ల రాహుల్ గాంధీ ప్రచారం, ఏడుచోట్ల ఓటమి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం మసకబారుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్! జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే అందులో ఏడు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది.
రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ పార్టీ గెలవదనే అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జార్ఖండ్లో రాహుల్ గాంధీ ఎనిమిది స్థానాల్లో ప్రచారం చేశారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా తన అంచనాలు చెప్పారు.
రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే దాదాపు నిజమైంది. ఒక్క ప్రాంతంలో మినహా మిగతా ఏడు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నియోజకవర్గంలో కూడా రాహుల్ ప్రచారం చేశారు. కానీ ఓడిపోయారు.
జార్ఖండ్లో ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ సభలకు కూడా భారీగానే జనాలు వచ్చారు. కాంకేలో రాహుల్ ర్యాలీ జనాలు వచ్చారు. అయితే, చాలామంది మధ్యలోనే వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తామో రాహుల్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఓ బీజేపీ నేత వ్యాఖ్యానిస్తూ.. నరేంద్ర మోడీ బీజేపీని ముందుకు తీసుకు వెళ్తుంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వెనక్కి తీసుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. జార్ఖండ్లో తమ పార్టీ సులభంగా గెలుస్తుందని ఆ నేత ముందే చెప్పారు.
రాహుల్ గాంధీ నాలుగు దఫాలుగా ఎనిమిది నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. మొదటి పేజ్లో మనికా, పంకీ, రెండో పేజ్లో జగన్నాథపూర్, చైబస, మూడో పేజ్లో రాంఘర్, కాంకే, నాలుగో పేజ్లో శిక్రిపారా, మహ్గామా ప్రచారం చేశారు.
మనికా, చైబస, జగననాథపూర్, శఇక్రిపారా, మహ్గామాలలో కాంగ్రెస్ పార్టీ కనీసం రెండో స్థానం కూడా దక్కించుకోలేదు. చైబసలో జేఎంఎం అభ్యర్థి దీపక్ బిర్సూ 68,801 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఎనిమిదివేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.
జగన్నాథపూర్లో గీతా కోడా 48,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ సింకుకు ఏడువేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. శిక్రిపారాలో జెఎంఎం నేత నలిన్ సోరెన్ 61,901 మెజార్టీతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి రాజా మరాండీకి 7,877 ఓట్లు వచ్చాయి. మహ్గామాలో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ 70,635 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థికి పద్దెనిమిదివేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది.
దల్తోన్గంజ్, రాంఘర్, కాంకేలలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురయింది. కాంకేలోను బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. రాహుల్ గాంధీ ప్రచారం చేసిన పంకీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడి అభ్యర్థి బిడేష్ సింగ్ కేవలం 1,995 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి పైన గెలుపొందారు.