ఏప్రిల్ నుండి మేకు వాయిదా!: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పేరును మే నెలలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అనుమానాస్పద స్థితిలో గత నెల రోజుల పైబడి సెలవులో ఉన్న రాహుల్ త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్ పర్యటనలో స్పష్టం చేశారు.
అయితే వచ్చే మే నెలలో జరుగుతుందని భావిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంలో గానీ, లేదా అంతకంటే ముందే జరుగుతుందని భావిస్తున్న ఏఐసీసీ సమావేశంలో గానీ రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమావేశాలను ఢిల్లీలో నిర్వహించాలా? లేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్లో నిర్వహించాలా? అనే దానిపై చర్చ సాగుతోంది. రాహుల్ సెలవు నుంచి తిరిగి వచ్చాక కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంశం ప్రాధాన్యతను సంతరించుకోనుందంటున్నారు.
మే నెలలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల పైన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సముఖమంగా ఉంటే సోనియా పార్టీ చైర్ పర్సన్గా కొనసాగుతారని చెబుతున్నారు.
కాగా, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది మే నెలకు వాయిదా పడింది. ఏప్రిల్ నెలలో రాహుల్కు పెద్ద బాధ్యతలని ఆ పార్టీకి చెందిన సీనియర్లు గతంలో వ్యాఖ్యానించారు.