ట్రంప్ అబద్ధాల కోరని ప్రకటించే దమ్ముందా ? మోడీకి రాహుల్ సవాల్..!
కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు చర్చలో భాగంగా లోక్ సభలో ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ పై ట్రంప్ అబద్దాలు చెప్తుంటే కేంద్రం ఎందుకు ఊరుకుంటోందని రాహుల్ ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా చోటు చేసుకున్న లోపాల్ని రాహుల్ ప్రస్తావించారు.
ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. పహల్గాం ఉగ్రదాడి నిందితుల్ని ఇప్పటివరకూ ఎందుకు పట్టుకోలేకపోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పాకిస్తాన్తో పోరాడటానికి రాజకీయ సంకల్పం లేదని విమర్శించారు. అందుకే చేతులు వెనుకకు కట్టుకుని దాడి చేయాలని సాయుధ దళాల్ని ఆదేశించారన్నారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకుంటున్నా మోడీ ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు.

కాల్పుల విరమణకు తానే కారణమంటూ ఇప్పటికే ట్రంప్ 29 సార్లు చెప్పుకున్నారని, అది అబద్ధమైతే ట్రంప్ ను అబద్ధాల కోరుగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రకటించే దమ్ముందా అని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఆపరేషన్ సిందూర్ను 1971లో భారత్-పాక్ యుద్ధంతో పోల్చడం ద్వారా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పు చేశారని విమర్శించారు. మన దేశంలో ఉగ్రవాద దాడి జరిగిన ప్రతిసారీ పాకిస్తాన్పై దాడి చేస్తామని చెప్పడం ద్వారా కేంద్రం తన గొయ్యి తాను తవ్వుకుందన్నారు.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా రాజకీయ నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. సైన్యం చేతులు కట్టేసిందన్నారు. ఓవైపు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదని ప్రకటన చేస్తూ.. మరోవైపు అక్కడికి మన సైన్యాన్ని పంపి దాడులు చేసిందన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. విపక్ష ఇండియా కూటమి తీవ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా నిలబడాలని తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి గుర్తుచేసారు.












Click it and Unblock the Notifications