మోడీ ప్రభుత్వానికి మార్కులు: పదికి అసోచాం 7, రాహుల్ గాంధీ 0
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. దేశ ప్రధానిగా నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప, రైతులను కలిసి, వారి కష్టాలను తెలుసుకోవడం లేదని విమర్శించారు.
ఆయనకు రైతులను పట్టించుకునే సమయం కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనకు పది మార్కులకు గాను సున్నా మార్కులు వచ్చాయని ఎద్దేవా చేశారు. సోమవారం తన సొంత నియోజక వర్గమైన అమేథిలో పర్యటించిన రాహుల్ గాంధీ, అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాందీ పైవ్యాఖ్యలు చేశారు. పుడ్ పార్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అమేథితో పాటు దాని చుట్టుప్రక్కల పది జిల్లాల్లోని రైతులు, కూలీలపై దాని ప్రభావితం చేసిందన్నారు.

కేంద్రం తనపై ప్రతీకారం తీసుకోవాలని చూస్తే, దాని ప్రభావం అమాయకులైన రైతులపై పడిందని చెప్పారు. రైతుల స్ధితిగతులను మారుద్దామని యూపీఏ ప్రభుత్వం ఇక్కడ పుడ్ పార్కుని నెలకొల్పిందన్నారు. దానిని రద్దు చేసి మోడీ ప్రభుత్వం రైతులను పెద్ద దెబ్బ కొట్టిందని అన్నారు.
రైతుల వద్ద నుంచి దానిని లాక్కున్నారని, నా నుంచి కాదని అన్నారు. మళ్లీ తిరిగి పుడ్ పార్కుని నెలకొల్పే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ సోమవారం అమేథిలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఎంపీ నిధులతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు రాహుల్ శంకుస్ధాపన చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు. ఇటీవలే అమేథిలో పర్యటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ గత మూడు నెలలుగా తన సొంత నియోజక వర్గంలో పర్యటించలేదని అన్నారు.
రెండు నెలలు అజ్ఞాతంలో ఉండి వచ్చిన రాహుల్ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను కిసాన్ యాత్ర పేరుతో పరామర్శించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కాగా స్మృతి ఇరానీ అమేధి పర్యటన నేపథ్యంలో, మే 18 నుంచి మూడు రోజులపాటు పర్యటిస్తానని రాహుల్ ప్రకటించారు. ఇందులో భాగంగానే రాహుల్ పర్యటన సాగుతుంది.
నరేంద్ర మోడీ ఏడాది పాలన: 10కి 7 మార్కులు
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పని తీరుకు అసోచాం పది మార్కులకు గాను ఏడు మార్కులు ఇచ్చింది. అయితే, ఇప్పటికీ కొన్నింటిని ఫుల్ ఫిల్ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. భారత దేశం యొక్క స్థూల ఆర్థిక పరిస్థితి ఈ ఏడాదిలో కొంత మెరుగైందని తెలిపింది. ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టడం, కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి జరిగాయి. కొన్ని పన్నుల విషయంలో ఎన్డీయే ప్రభుత్వం పునాది నుండి కవర్ చేయాల్సి ఉంది. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అసోచామ్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications