ప్రియాంక రావాలని బేనర్లు, ఒత్తిడిలో రాహుల్: బీజేపీ
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇటీవల సాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను ఓడించాలంటే ప్రియాంక, ప్రత్యక్ష బరిలోకి దిగాల్సిందేనని అలహాబాద్కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నేతలు హసీబ్ అహ్మద్, శిరీష్ చంద్ర దూబేలు వాదిస్తున్నారు.
వాదనలకే పరిమితం కాని వీరు, అలహాబాద్లోని ప్రధాన కూడలిలో ఏకంగా బేనర్లనే ఏర్పాటు చేశారు. గతంలోనూ ఈ తరహాలోనే పార్టీ అనుమతి లేకుండా బేనర్లు కట్టిన వీరు, బహిష్కరణకు గురైనా, తిరిగి పార్టీలోకి ఎలాగోలా వచ్చేశారు. అయితే ఈసారి కూడా వీరి చర్యపై పార్టీ అధిష్ఠానం కాస్త కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఈ బేనర్లో రాహుల్ ఫోటో, పేరు లేదు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రాహుల్ను తప్పించి, ప్రియాంకను తీసుకు రావాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒత్తిడిలో రాహుల్
రాహుల్ గాంధీ ఒత్తిడిలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. బుధవారం రాహుల్, కాంగ్రెసు పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని, వెల్లోకి వచ్చిన నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తన నిరసనను రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. దీనిపై బీజేపీ కౌంటర్ విసిరింది.
లోకసభలో స్పీకర్ పక్షపాత వైఖరి వహిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ... రాహుల్, కాంగ్రెసు పార్టీలు ఒత్తిడిలో ఉన్నాయన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి వహిస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలా వ్యాఖ్యానించడం వల్ల రాహుల్లో ఒత్తిడి కనిపిస్తోందన్నారు.