రాహల్కు పార్టీ పగ్గాలు: పట్టాభిషేకానికి సిద్ధం?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి కట్టబెట్టనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు అప్పంగించేందుకు రంగం సిద్ధమైందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇందుకోసం పార్టీలో సన్నాహాలు జరుగుతున్నట్లు పారీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, అందులో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమించాలని వాదిస్తున్నారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు పాలవడంతో పార్టీకో కొత్త జీవాన్ని నింపాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సోనియా గాంధీ కూడా ఇదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్కు పార్టీ బాధ్యతలు అప్పగించి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవికే సోనియా పరిమితం అవుతారని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జాతీయ కార్యవర్గం మొత్తాన్ని కూడా పూర్తిగా మారుస్తారని చెబుతున్నారు. ఎక్కువగా యువకులకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన బృందం ఎంపికలో రాహుల్ తలమునకలై ఉన్నారు. పార్టీలో కొత్తవారికి చోటు కల్పించే దిశగా కసరత్తు ప్రారంభించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి కట్టబెట్టాలన్న చర్చ ఎప్పటినుంచో వినిపిస్తున్నా ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. తనపై ఉన్న బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని సోనియా గాంధీ వ్యాఖ్యానించినట్టు ఆ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల మీడియాతో వెల్లడించారు.
దీంతో అతి త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం కావడం, ఆపై పార్టీకి శస్త్రచికిత్స చేయాల్సి వుందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. సోనియా గాంధీ ప్రస్తుతం 70వ పడిలోకి ప్రవేశించారు.
దీంతో ఆమెకు విశ్రాంతినిచ్చి, రాహుల్ను ముందు నిలిపి, సలాహాలు, సూచనలు ఇచ్చేందుకే పరిమితం కావాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండగా, సాధ్యమైనంత త్వరగా, పార్టీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్ కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.