హతవిధి : రాహుల్ ఖాట్ సభలో.. మళ్లీ మంచాలు ఎత్తుకెళ్లిపోయారు..
దేవరియా : రాహుల్ గాంధీ 'ఖాట్సభ (మంచాల)' కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్ లో అభాసుపాలవుతోంది. మొన్నటికి మొన్న దేవరియా జిల్లాలోని రుద్రాపూర్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు వచ్చిన స్థానికులంతా.. కేవలం మంచాల కోసమే రాహుల్ సభకు హాజరయ్యాం అన్నట్లుగా మంచాల కోసం కొట్టుకుని రాహుల్ ను నవ్వులపాలు చేసేశారు.
ఆ ఘటనను మరిచిపోకముందే.. రాహుల్ గాంధీకి మరోసారి అదే చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ పరిధిలో ఉన్న మదీహాన్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు వచ్చినవారంతా సభ అయిపోగానే మంచాల కోసం ఎగబడ్డారు. సభ ముగియడమే ఆలస్యం.. ఎవరికి దొరికిన మంచం వారు ఎత్తుకెళ్లిపోయారు.

'మంచాలు ఎత్తుకెళ్లవద్దు.. అక్కడే వదిలేసి వెళ్లండి' అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఎంత నచ్చజెప్పినా.. పెద్దగా లాభం లేకుండా లేకపోయింది. సభకు హాజరైన ఓ స్థానికుడు దీనిపై స్పందిస్తూ.. అసలు మేము సభకు హజరయిందే మంచాల కోసమని చెప్పడం గమనార్హం. ఉచితంగా మంచాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పబట్టే సభకు హాజరయ్యామని సదరు వ్యక్తి తెలిపాడు.
సభకు హాజరయితే మంచాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. తీరా సభకు వచ్చాక మాత్రం ప్లేటు ఫిరాయించారని సభకు హాజరైన ప్రజలు వాపోతున్నారు. మంచాలకు బదులు తమ చేతిలో కాంగ్రెస్ జెండాలు పెట్టి తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు.
కాగా, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుతండడంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోన్న రాహుల్.. ఇందుకోసం రుద్రాపూర్ నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మహాయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని 223 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఆయన మహాయాత్ర కొనసాగబోతుంది.












Click it and Unblock the Notifications