చూస్తా: హామీ ఇవ్వని రాహుల్, వెల్లోకే కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నుండి సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఎలాంటి హామీ రాలేదు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, రాయల తెలంగాణ ఇవ్వాలన్న సీమాంధ్ర మంత్రుల విజ్ఞప్తిని రాహుల్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. యూటి, రాయల టి పైన వారికి ఎలాంటి హామీ రాలేదు. దీంతో మంత్రులు కూడా వెల్లోకి వెళ్లి ఆందోళన చేసే విషయంలో తగ్గడం లేదు. లోకసభలో చర్చ జరిగే సమయంలో వెల్లోకి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, ఆ నగర ఆదాయంలో తమకు వాటా కల్పించాలని కేంద్రమంత్రులు, ఎంపిలు రాహుల్ గాంధీని కోరారు. ఈ మేరకు వారు సోమవారం రాహుల్ను కలిసినపుడు ఒక వినతి పత్రం సమర్పించారు. తమ మాటలను సావకాశంగా విన్న తర్వాత సీమాంధ్రకు చేయగలిగినంత చేస్తానని, తెలంగాణ బిల్లుపై ప్రభుత్వంతో సహకరించాలని ఆయన తమను కోరినట్లు వారు తెలిపారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు లేవనెత్తిన అభ్యంతరాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించేందుకు రాహుల్ ఆఖరి క్షణంలో రంగ ప్రవేశం చేశారు. సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, కిశోర్ చంద్రదేవ్, పళ్లంరాజు, చిరంజీవి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలం, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపిలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపి అనంత వెంకటరామి రెడ్డి, కెవిపి రామచంద్ర రావు హాజరు కాలేదు.
కాంగ్రెస్ అధినాయకత్వం తరపున రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జైరాం రమేష్ పాల్గొన్నారు. సీమాంధ్రను ప్రత్యేక క్యాటగరీ రాష్ట్రంగా ప్రకటించి అన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రులు, ఎంపిలు కోరారు. రెండు ప్రాంతాల వారికి న్యాయం కలిగించాలన్నది రాహుల్ అభిప్రాయమని శీలం తెలిపారు. సమస్యలను పరిష్కరించలేకపోతే ప్రజల వద్దకు వెళ్లటం తమకు సాధ్యం కాదని వారు వివరించారు.
హైదరాబాద్ను తాత్కాలికంగానైనా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరినట్లు జెడి శఈలం తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కోరినట్లు ఆయన వెల్లడించారు. సీమాంధ్రకు పెట్టుబడులు వచ్చేందుకు పన్నుల రాయితీ ఇవ్వాలని కోరామన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశామన్నారు. నీటి సమస్య వంటి ప్రత్యేక కారణాల వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలను చేర్చి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీని కోరామన్నారు.