పేటీఎం అంటే పే టూ మోడీ: నరకమేనని రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. తమ డబ్బును తాము తీసుకునేందుకు ప్రాణత్యాగం చేయాల్సి వస్తోందని దుయ్యబట్టారు. అంతేగాక, పార్లమెంట్లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇస్తే అన్నీ వివరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
పేటీఎం ఏ తరహాలో పే టూ మోడీగా మారిందో తాను సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రధాని మోడీ సభకు రావడం లేదని, అతను సభ నుంచి పారిపోతున్నారని, ప్రధాని సభకు వస్తే, అతన్ని మేం వదలమని రాహుల్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి మోడీ నవ్వుతున్నారని, కానీ పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాహుల్ విమర్శించారు.
కొద్ది మందికి మాత్రమే ఎక్కువ లాభాలు చేకూర్చేందుకు క్యాష్లెస్ ఆర్థిక వ్యవస్థ ఆలోచనను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియ వల్ల యావత్ దేశం నాశనమైందన్నారు. నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మాటలు మారుస్తున్నారన్నారు. తొలుత నల్లధనం అన్నారని, తర్వాత ఉగ్రవాదం, నకిలీ నోట్లు అరికడుదామన్నారని, ఇప్పుడు మాత్రం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు.

మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైంది కాదని, అదో తెలివి తక్కువ నిర్ణయమన్నారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఆ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేద ప్రజలు, రోజు వారి కూలీలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.
బ్లాక్ డేగా నిరసనలు
పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు గడిచిన నేపథ్యంలో అందుకు నిరసనంగా గురువారం ప్రతిపక్ష పార్టీ నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. నోట్లు రద్దు చేసిన తర్వాత మొదటి నెల వర్థంతి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీలంతా నల్ల బ్యాడ్జీలు ధరించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజలు ఇబ్బందిపడుతున్నారని నేతలు ఆరోపించారు.
పార్లమెంటులో కొనసాగిన విపక్షాల ఆందోళన
పెద్ద నోట్ల రద్దు అంశం గురువారం కూడా ఉభయసభలను విపక్షాలు అడ్డుకున్నాయి. లోక్సభతో పాటు రాజ్యసభలోనూ విపక్షాలు నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. చర్చ జరగాలంటే, సభను అడ్డుకోరాదని స్పీకర్ విపక్ష ఎంపీలను కోరారు. అయినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో తొలుత స్పీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ విపక్షాలు ఇదే సమస్యపై పట్టుపట్టాయి. రూల్ 246, 247 ప్రకారం చర్చను చేపట్టాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి డిమాండ్ చేశారు.
నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నానమని, నోట్ల రద్దు వల్ల ఇప్పటికే 100 మంది మృతిచెందారని, మృతులకు సభ నివాళి అర్పించాలని, అందుకే గురువారంను బ్లాక్ డేగా నిర్వహించామని కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ అన్నారు. విపక్షాలు అదే పనిగా ఆందోళన చేస్తున్నాయని, సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమైనప్పుడు, వెల్లోకి దూసుకెళ్లుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను మొదట 12 గంట వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ అదే సీన్ కొనసాగడంతో సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఉభయ సభలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి.












Click it and Unblock the Notifications