ఢిల్లీలో అధికారిక బంగ్లా ఖాళీ చేయండి: రాహుల్ గాంధీకి నోటీసులు
న్యూఢిల్లీ: క్రిమినల్, పరువునష్టం కేసులో దోషిగా తేలడం, ఆ తర్వాత ఎంపీ పదవి నుంచి అనర్హతకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల్లోగా రాహుల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్సభ హౌసింగ్ కమిటీ ఆయనకు నోటీసులు పంపినట్లు తెలిసింది.
ఢిల్లీలోని 12 ఏళ్ల తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. ఏప్రిల్ 22లోగా అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని గడువు కూడా పెట్టినట్లు పార్లమెంటు వర్గాలు పేర్కొన్నాయి. కాగా,రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి తన మొదటి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లుటియన్స్ ఢిల్లీలో 12 తుగ్లక్ లేన్ను కేటాయించారు.

తాజా, పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉండేందుకు అనర్హుడిగా పేర్కొంటూ లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై స్పందించిన రాహుల్ టీం.. తమకు ఇంకా ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపింది.
మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అన్న అర్థం వచ్చేలా ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే రాహుల్ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడంటూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడంతో రాహుల్కు వచ్చే ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. ఈ క్రమంలోనే అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, పై కోర్టులో రాహుల్కు ఊరట లభిస్తే తప్ప ఏప్రిల్ 22లోపు తన అధికార నివాసాన్ని ఖాళీ చేయక తప్పదు. మరోవైపు, రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తూ నిరసనల్లో పాల్గొంటున్నాయి. నల్ల దుస్తులు ధరించి సోమవారం నిరసనలు తెలిపారు.












Click it and Unblock the Notifications