రాహుల్ నాయకత్వంలో: అధ్యక్షురాలిగా చివరి ప్రసంగమంటూ సోనియా భావోద్వేగం, ‘బాణాసంచా’తో ఇబ్బంది
Recommended Video
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరంతా పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న రాహుల్ గాంధీకి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చివరి సారి మాట్లాడుతున్నానని సోనియా గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
బాణాసంచాతో ఇబ్బందిపడ్డ సోనియా..
ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బాణాసంచాలో భారీ ఎత్తున కాల్చాయి కాంగ్రెస్ శ్రేణులు. దీంతో ఆమె కొంత ఇబ్బందికి గురయ్యారు. తాను గట్టిగా మాట్లాడలేనని చెప్పారు. సోనియా గాంధీ మాట్లాడుతున్నారని.. బాణాసంచా కాల్చడం ఆపేయాలని మరో కాంగ్రెస్ నేత మైకులో చెప్పారు. బాణాసంచా కాల్చడం ఆపిన తర్వాత మళ్లీ సోనియ ాతన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. 20ఏళ్ల క్రితం తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేశారని అన్నారు. అందరి ఒత్తిడి వల్లే తాను ఆ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. అయితే, అప్పుడు తాను పార్టీ బాధ్యతలు నిర్వహించగలనా? అనే అనుమానం కలిగిందని చెప్పారు.
ఇందిరా, రాజీవ్ స్ఫూర్తితో మీ అందరి సహకారంతో తాము రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని సోనియా చెప్పారు. ఇందిరా గాంధీ తనను కూతురులా చూసుకున్నారని అన్నారు. ఇందిరా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని సోనియా తెలిపారు. ఇందిరా, రాజీవ్లా బలిదానాలు వృథా కానివ్వొద్దని అన్నారు. 2014 నుంచి రాజ్యాంగ విలువలకు విఘాతం కలుగుతోందని సోనియా ఆరోపించారు.
అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ శక్తివంతమైన నాయకురాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం అభివృద్ధి దిశగా ప్రయాణించిందని అన్నారు. సోనియా నాయకత్వం కాంగ్రెస్ అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.