రాహుల్ కీలక నిర్ణయం-మోడీని తిట్టిన చోటే కర్నాటక ప్రచారం మొదలు-వాయనాడ్ పై ఈసీ క్లారిటీ..
2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సూరత్ కోర్టు తీర్పుతో లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా మారిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలో ఎక్కడైతే మోడీపై వ్యాఖ్యలు చేసి ఈ వివాదానికి కారణమయ్యారో అక్కడి నుంచే కర్నాటక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని రాహుల్ నిర్ణయించారు.
కర్నాటకలోని కోలార్ లో 2019లో రాహుల్ గాంధీ మోడీలంతా దొంగలేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచే రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. తద్వారా బీజేపీకి పెను సవాల్ విసరాలని ఆయన భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కోలార్ లో మరోసారి అదే మోడీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు రాహుల్ సిద్ధమవుతున్నారు. కర్నాటక ఎన్నికలకు ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఇప్పటివరకూ ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వాయనాడ్ ఎంపీ సీటుకు ఉపఎన్నికలు నిర్వహిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని ఆయన తెలిపారు. రాహుల్ ను దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకు అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చిందని గుర్తుచేశారు. అనంతరం దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది కాబట్టి కోర్టు తీర్పుల్ని బట్టి ఎన్నికల సంఘం వాయనాడ్ ఉపఎన్నికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.













Click it and Unblock the Notifications