కన్యాకుమారికి రాహుల్ గాంధీ, ప్రధాని మోడీపై విమర్శలకు చాన్స్, పార్టీకి నో చాన్స్ !
చెన్నై: ఓఖీ తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ నేడు కన్యాకుమారి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా కన్యాకుమారి జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తుపాను బాధితులను కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించే అవకాశం ఉందని తెలిసింది.
ఓఖీ తుపాను దెబ్బతో !
ఓఖీ తుపాను తాండవానికి కన్యాకుమారి జిల్లా సర్వం కోల్పోయిన విషయం తెలిసిందే. సముద్రంలోకి వెళ్లిన వందలాది మంది జాలర్ల జాడ ఇంకా తెలియడం లేదు. ఆదుకుంటామన్న తమిళనాడు ప్రభుత్వం భరోసా ఇచ్చినా బాధితులు మాత్రం రోడ్ల మీద నిలబడి పోరాటం సాగిస్తూన్నారు.
నిర్మాలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కన్యాకుమారి జిల్లాలోని బాధితుల్ని పరామర్శించారు.
కాంగ్రెస్ స్కెచ్
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం విరామం తీసుకుని కన్యాకుమారి జిల్లాలో పర్యటించడానికి సిద్దం అయ్యారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కన్యాకుమారీ జిల్లాలోని బాధితులను నిర్లక్షం చేస్తోందని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పర్యటనకు శ్రీకారం చుట్టారని తెలిసింది.
కాంగ్రెస్ నేతల ప్లాన్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ కన్యాకుమారి జిల్లాలో పర్యటించనుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కన్యాకుమారి జిల్లాకు తరలి వెళ్లారు.
పార్టీ కార్యక్రమాలకు దూరం ?
కాంగ్రెస్ పార్టీ వర్గాలతో ఎలాంటి చర్చలకు అవకాశం లేకుండా, కేవలం కన్యాకుమారి జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే ప్రజలు, రైతులు, జాలర్లను పరామర్శించడానకి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ భావించారని తెలిసింది.
జాలర్లు, రైతులతో భేటీ
రాహుల్ గాంధీ మొదట చిన్నదురైలో తుపాను బాధితుల్ని పరామర్శించనున్నారు. ఆ తరువాత పంట పొలాలు, జాలర్ల గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. రైతు సంఘాలు, జాలర్ల ప్రతినిధులతో సమావేశమయ్యే విధంగా రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ పార్టీ తమిళనాడుకు చెందిన నాయకులు రూపొందించారు.
నిఘా నీడలో కన్యాకుమారి !
రాహుల్ గాంధీ పర్యటనతో కన్యాకుమారి జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పర్యటన ప్రాంతాల్లో భద్రత పెంచారు. తుత్తుకూడి, తిరునల్వేలి జిల్లాల నుంచి అదనపు బలగాలను కన్యాకుమారికి తరలించారు.
650 మంది జాలర్లు మాయం ?
కన్యాకుమారి జిల్లాకు చెందిన వందలాది మంది జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి ఓఖీ తుపాను కారణంగా గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకూ దాదాపు 650 మంది జాలర్ల ఆచూకి తేలియడంలేదని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జాలర్ల సంఘం నాయకులు మండిపడుతున్నారు.