మోడీ ఒక్కరే దేశాన్ని ఉద్దరిస్తున్నారా, ప్రజలను అవమానించారు, రాహుల్ గాంధీ ఫైర్ !
ఉడిపి/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో దేశానికి ఏం చేసిందని ప్రధాని నరేంద్ మోడీ ప్రశ్నించి తల్లిదండ్రులు, వృద్దులు, దేశంలోని రైతులు, కార్మికుల కష్టాన్ని అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజలను అవమానించే వ్యాఖ్యలు చెయ్యడం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మానుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. శాసన సభ ఎన్నికల సందర్బంగా మంగళవారం దక్షిణ కన్నడ జిల్లాలోని ఉడిపి సమీపంలోని మూడబిద్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఒక్కరే ఉద్దరిస్తారా !
70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏమీ చెయ్యలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించడంలో అర్థం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని ఒక్కరే ఉద్దరిస్తారని నరేంద్ర మోడీ కలలుకంటున్నారని, అది ఎలా సాధ్యం అవుతోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
భారత్ తల ఎత్తుకుంది
ప్రపంచ దేశాల ముందు నేడు భారత్ తల ఎత్తుకుని గర్వంగా నిలబడిందని, దేశంలోని 125 కోట్ల మంది కష్టపడటంతోనే అదిసాధ్యం అయ్యిందనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు.
మీ కష్టంతో ఈ స్థాయికి !
స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ మీ తల్లిదండ్రులు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు శ్రమించి రక్తం దారపోస్తే భారతదేశం ఇంత ఉన్నతస్థాయికి వచ్చిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు మీ తల్లిదండ్రులు, రైతులు, కార్మికులు, చిరువ్యాపారులను అవమానించినట్లు ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రూ. 15 లక్షలు కాదు రూ. 10
నరేంద్ర మోడీగారు మీరు బసవణ్ణ తత్వాలు గౌరవిస్తాను అని గోప్పగా చెప్పుకుంటున్నారు, అసలు మీరు పేద ప్రజల కష్టాలు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా ? అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఒక్కరి బ్యాంక్ అకౌంట్ కు రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని అన్నారు. కనీసం రూ. 10 డిపాజిట్ చేసి పరువునిలుపుకోండి అని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే సందర్బంలో మోడీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.