నుపుర్ శర్మపై సుప్రీం వ్యాఖ్యల్ని సమర్ధించిన రాహుల్ -ఈ పరిస్ధితికి మోడీ సర్కారే కారణమంటూ
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ నోటి దూల వల్ల దేశం తగలబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశం మొత్తానికి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు.
నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ సమర్ధించారు. దేశంలో కోపం , ద్వేషపూరిత వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని. ఇందులో నుపుర్ శర్మ ఒక్క వ్యక్తి మాత్రమేనని ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలిపారు. కేరళలోని వాయనాడ్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్.. "సుప్రీంకోర్టు ఇలా చెప్పింది. కానీ దేశంలో వాతావరణాన్ని పాలక ప్రభుత్వం సృష్టించింది, ఈ ప్రకటన చేసింది వ్యక్తి కాదు, ఇది ప్రధానమంత్రి, హోంమంత్రి., దేశంలో ఈ వాతావరణాన్ని సృష్టించింది బిజెపి , ఆర్ఎస్ఎస్. ఈ కోపం, ఈ ద్వేషపూరిత వాతావరణం అన్నీ వారి చలవే.. ఇది భారతదేశంలో మన ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.
అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మ ప్రవక్త వ్యాఖ్యలపై ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది . ఆమె "బాధ్యతారహిత ప్రకటనలు మొత్తం దేశాన్ని మంటల్లోకి నెట్టాయి" అని పేర్కొంది. ప్రవక్త ముహమ్మద్పై ఆమె చేసిన వ్యాఖ్యలు చౌకైన ప్రచారం, రాజకీయ ఎజెండా లేదా కొన్ని నీచ కార్యకలాపాల కోసం చేసినవేనని కోర్టు పేర్కొంది.
Recommended Video
మరోవైపు తన పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనలో ఉన్న మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, వాయనాడ్లోని తన కార్యాలయంపై దాడిపై కూడా స్పందించారు. "ఇది దురదృష్టకరం. ఇది నా కార్యాలయం కాదు, వాయనాడ్ ప్రజలకు చెందినది. ఇదో వెర్రి చేష్ట" అని ఆయన అన్నారు. జూన్ 24న సీపీఐ(ఎం) యువజన విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) వాయనాడ్లోని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్జెడ్)పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేదంటూ వాయనాడ్ ఎంపీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.