దక్షిణాదిపై రాహుల్ భారీ వ్యూహం..! ఆ మూడు నిర్ణయాల వెనుక ?
2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ఓటముల పర్వం లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఇదే క్రమంలో 2019, 2024 ఎన్నికల్లోనూ తిరిగి అధికారం అందుకోలేకపోయిన కాంగ్రెస్ కు కొన్నేళ్లుగా ఊరటనిస్తోంది దక్షిణాది రాజకీయమే. ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ ఉన్న వైవిధ్యానికి తోడు, ద్రవిడ భావజాలం కూడా ఇందుకు తోడ్పడుతున్నాయి. దీంతో దక్షిణాదిలో తమ స్ధానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ఇప్పుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పావులు కదుపుతున్నారు. ఇందులో భాగమే తాజాగా తమిళనాడు, కేరళ, కర్నాటకలో తీసుకున్న నిర్ణయాలు.
దక్షిణాదిలో రాహుల్ కీలక నిర్ణయాలు (Rahul Gandhi)
దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యక్షంగా నాలుగు చోట్ల అధికారంలో ఉంది. కర్నాటక, కేరళ, తెలంగాణలో నేరుగా ప్రభుత్వాలను నడుపుతోంది. తమిళనాడులోనూ తొలిసారి ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకుంటోంది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏపీ రాజకీయాల్ని కాసేపు పక్కనబెడితే దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు వెనుక ప్రధాన కారణం రాహుల్ గాంధీ. తాజాగా కర్నాటకలో సీఎం మార్పు రాహుల్ గాంధీ నెల రోజుల్లో వ్యక్తిగతంగా తీసుకున్న మూడో కీలక నిర్ణయం. ఇది రాహుల్ గాంధీ రాజకీయ శైలిలో స్పష్టమైన మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. గత కొద్ది వారాలుగా ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ వర్గాల్లో కొందరు రాహుల్ గాంధీ "తన సహజ ప్రవృత్తిని మునుపటి కంటే ఎక్కువగా విశ్వసిస్తున్నారు" అని గోప్యంగా చెబుతున్నారు. సంవత్సరాలుగా, పార్టీలో అంతర్గత, బహిరంగ విమర్శకులు రాహుల్ గాంధీకి కఠినమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారం, ఆ నైపుణ్యం లేదని ప్రశ్నించారు. అయితే, ఆయన ఈ మధ్యకాలంలో తన చర్యలతో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

తమిళనాడుతో మొదటి సంకేతం
మొదటి సంకేతం తమిళనాడులో వచ్చింది. పార్టీ అంతర్గత వర్గాల ప్రకారం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ రాజకీయ ఆలోచన డీఎంకే కూటమిపై పూర్తిగా ఆధారపడకుండా, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్తో ఒక అవగాహన కుదుర్చుకోవాలని ఉంది. కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొదట్లో దీనిపై సుముఖంగా లేరు, డీఎంకే నుండి దూరం కావడం ప్రమాదకరమన్నారు. అయితే, విజయ్ ప్రవేశం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చిందని, కాంగ్రెస్ ఆలస్యంగా స్పందించకుండా దూకుడుగా వ్యవహరించారని రాహుల్ భావించారు. ఎన్నికల తర్వాత, విజయ్కు భారీ ప్రజాదరణ లభించాక ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళలో ప్రజా మద్దతుకే ఓటు
రెండవ నిర్ణయం కేరళలో వెలువడింది. అక్కడ నాయకత్వం సీనియర్ నాయకుడైన కేసీ వేణుగోపాల్ ను కాదని యువ నాయకుడు వీడీ సతీశన్ను పార్టీ భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంచుకుంది. కేసీ వేణుగోపాల్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా, ప్రజా మద్దతు ఉన్న వీడీ సతీశన్ నే రాహుల్ సీఎంగా ఎంపిక చేశారు. ఇది తరతరాల, సంస్థాగత ఎంపికగా విశ్లేషిస్తున్నారు. ఇది ఢిల్లీ కేంద్రంగా దశాబ్దాలుగా సాగిన కాంగ్రెస్ రాజకీయాలకు విరుద్దంగా ప్రజా మద్దతుకు అధిష్టానం ఇచ్చిన గౌరవంగా రాజకీయ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. సతీశన్కు తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఆయనవైపే మొగ్గారు.

కర్నాటకలో సీఎం మార్పు
ఇప్పుడు కర్ణాటక వంతు వచ్చింది. సిద్ధరామయ్య నుండి డీకే శివకుమార్కు జరగబోయే మార్పిడిని కాంగ్రెస్ లోపల రాజకీయ సమతుల్యత సాధించడానికి, దీర్ఘకాలిక ఎన్నికల లెక్కల ప్రకారం తీసుకున్న నిర్ణయంగా చూస్తున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుండి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు నాయకత్వ మార్పిడి అనేది పూర్తిగా రాహుల్ గాంధీ నిర్ణయమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజా మద్దతు గమనించి సిద్దరామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు గట్టి పోటీదారుగా ఉన్న డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టింది. అయితే భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకోవడం ద్వారా ప్రస్తుతం దక్షిణాదిపై పెరుగుతున్న తమ పట్టును కొనసాగించే అవకాశం ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చింది. దీని ఫలితమే సిద్దరామయ్యకు ఉద్వాసనతో పాటు డీకే శివకుమార్ సీఎం పదవి అని భావిస్తున్నారు. అలాగే కర్నాటకలో ప్రజా వ్యతిరేకతను అధిగమించే ఆలోచన కూడా అని చెప్తున్నారు.















Click it and Unblock the Notifications