రాహుల్, ప్రియాంక చిన్నపిల్లలే.. పరిణితి చెందాల్సి ఉంది: అమరీందర్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. క్యాంపెయిన్లో నేతలు బిజీగా ఉన్నారు. రేసులో ముందున్న కాంగ్రెస్ పార్టీని, పార్టీ హైకమాండ్ను ఉద్దేశించి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురించి ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పరిణతిపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. గాంధీ వారసులు రాజకీయంగా ఇంకా చిన్నపిల్లలే అన్నారు. పొలిటీషియన్గా రాహుల్ గాంధీ ఇంకా ఎదగాల్సి ఉందన్నారు.
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్, ప్రియాంక గాంధీ.. కెప్టెన్ పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పాలన గురించి ఇటీవల ప్రస్తావించారు. ఆయన్ను తొలగించడానికి, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వెంటనే తీసుకున్న రాజకీయ, పాలన పరమైన పరిణామాలను వివరించారు. రాహుల్, ప్రియాంక గురించి ప్రస్తావించారు. దీనిపై మీడియా ప్రతినిధులు అడగగా.. బదులిచ్చేందుకు కెప్టెన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. రాహుల్, ప్రియాంక రాజకీయంగా ఇంకా పూర్తిస్థాయిలో ఎదగలేదన్నారు.
తనకు ముని మనవళ్లు ఉన్నారు. వాళ్లు తనకు పిల్లలతో సమానం అని చెప్పారు. వాళ్ల నాన్న (రాజీవ్ గాంధీ) తనకు స్నేహితుడు. రాహుల్కు యాభయ్యేళ్లున్నంత మాత్రాన రాహుల్ గానీ, ప్రియాంక గానీ ఐన్స్టీన్ అంత గొప్పవాళ్లేం కాదు కదా అని కామెంట్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ ఆర్డర్స్ పాటించానన్న రాహుల్ ఆరోపణలను ఖండించారు. రాహుల్, ప్రియాంక చాలామందిలాగే సాధారణ రాజకీయ నాయకులు. టైంతో పాటు వాళ్లు ఎదగాల్సి ఉంది. టైంతో పాటే వాళ్లు ఎక్స్ పీరియన్స సంపాదించాల్సి ఉందన్నారు.
అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 65 సీట్లలో బరిలో ఉంది. కూటమిలోని ధిండ్సా పార్టీ 15 సీట్లలో బరిలోకి దిగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.