మీరట్ వెళ్లడానికి వీల్లేదు.. రాహుల్, ప్రియాంకను తిప్పిపంపిన యూపీ పోలీసులు
కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాకు మంగళవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు చుక్కలుచూపించారు. మీరట్ కు వెళ్లాలనుకున్న ఆ ఇద్దరినీ సిటీ శివారులోనే అడ్డుకున్నారు. లోనికి ప్రవేశం లేదంటూ అటునుంచటే ఢిల్లీకి తిప్పిపంపించారు. దీంతో యూపీ పోలీసులు, యోగి సర్కార్ తీరుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
వాళ్లు అమరవీరులు..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా 20 మందికిపైగా చనిపోగా, అందులో 17 మంది యూపీకి చెందినవారేకావడం తెలిసిందే. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో చనిపోయినవాళ్లను అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి యూపీ బయల్దేరారు. మొదట మీర్ లో చనిపోయిన నలుగురి కుటుంబాల్ని కలవాలనుకున్నారు. కానీ అందుకు పోలీసులు అనుమతించలేదు.
ఆర్డర్ కాపీ అడిగితే లేదన్నారు: రాహుల్
రాహుల్, ప్రియాక ప్రయాణిస్తున్న కారును మీరట్ శివారులోనే అడ్డగించిన పోలీసులు.. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. ‘‘కారులో డ్రైవర్ తోపాటు ముగ్గురమే ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని ఎందుకు అనుమతించడంలేదని పోలీసుల్ని అడిగితే సమాధానం చెప్పలేదు. పోనీ, ఆర్డర్ కాపీ ఏదైనా ఉందాంటే.. లేదని చెప్పారు''అని రాహుల్ తెలిపారు. కారును ఆపేసిన సమయంలో పోలీసులతో ప్రియాక వాదనకు దిగారు.
యూపీ అంతటా కొనసాగుతున్న నిరసనలు
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో మంగళవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్ర రాజధాని లక్నోలో ఆదివారం రాత్రి హింస చెలరేగడంతో అదనపు పోలీసు బలగాల్ని రంగంలోకి దించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసినట్లు కలెక్టర్ అభిషేక్ ప్రకాశ్ చెప్పారు. ఈ నిషేధం బుధవారం వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఇవాళ కూడా చాలా చోట్ల 144 సెక్షన్ కొనసాగింది.