రైలు టికెట్లు తీసుకోవడం గగనం: తత్కాల్, కరెంట్ బుకింగ్పై కీలక నిర్ణయం: అలాంటి టికెట్లు చెల్లవు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంగళవారం నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ సహా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా- మంగళవారం నుంచి పాక్షికంగా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
Recommended Video
లాక్డౌన్ను ఎత్తేసే పరిస్థితులు అక్కడ లేవు: జూన్ 1 వరకు పొడిగింపు: ఈ సారి మరింత కఠినంగా:
ఈ సారి అధికారికం..
దేశ రాజధానిని కేంద్రబిందువుగా చేసుకుని కొన్ని ప్రధాన నగరాలకు రైళ్లను నడిపించబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇదివరకు కూడా లాక్డౌన్ గడువు ముగింపు దశకు వచ్చిన ప్రతీసారీ రైళ్లు నడుస్తాయనే వార్తలు వచ్చినప్పటికీ.. అలా జరగలేదు. ఈ సారి రైళ్ల రాకపోకలు ఖాయం అయ్యాయి. న్యూఢిల్లీ నుంచి కొన్ని ప్రధాన నగరాలకు రైళ్లను నడిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టికెట్లు రిజర్వేషన్ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది.
టికెట్ల జారీలో కీలక నిర్ణయాలు..
టికెట్లను జారీ చేసే విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏజెంట్ల ద్వారా జారీ చేసే టికెట్లు చెల్లవని వెల్లడించింది. రైల్వే లేదా ఐఆర్సీటీసీ ఏజెంట్లు జారీ చేసిన టికెట్లపై కూడా ప్రయాణాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను మాత్రమే అనుమతిస్తామని, అలాంటి వాటిపై మాత్రమే ప్రయాణించవచ్చని తేల్చి చెప్పింది.
నో తత్కాల్.. నో కరెంట్ బుకింగ్..
రైలు బయలుదేరే చివరి రెండు గంటల వరకు కూడా టికెట్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న తత్కాల్ వ్యవస్థను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు రైల్వే అధికారులు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ ద్వారా టికెట్లను జారీ చేయబోవట్లేదని వెల్లడించారు. కరెంట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉండబోదని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే.. వాటిని పునఃప్రారంభించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పినట్టయింది.
ఏసీ కోచ్లో ధరల మంట..
ఒక్కో రైలుకు ఒక్కో ఏసీ బోగీని అందుబాటులోకి తీసుకుని రానున్నారు అధికారులు. వాటిల్లో ప్రయాణించాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. రాజధాని ఎక్స్ప్రెస్తో సమానమైన ఛార్జీలను వసూలు చేయనున్నారు. రాజధాని ఎక్స్ప్రెస్లో వసూలు చేసే ఛార్జీ రేట్లను ఏసీ బోగీలకు నిర్ధారించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు హాల్ట్ అయ్యే అన్ని స్టేషన్లకూ టికెట్లను ఇవ్వబోమని చెప్పారు. లిమిటెడ్ హాల్ట్స్ ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ మార్గాల్లోనే రైళ్ల రాకపోకలు..
మంగళవారం నుంచి పట్టాలెక్కబోతోన్న రైళ్లన్నింటినీ స్పెషల్ సర్వీసులుగా గుర్తించారు. దానికి అనుగుణంగానే ఛార్జీలను వసూలు చేస్తారు. తిరుగు ప్రయాణంతో కలుపుకొని మొత్తం 30 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, భిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి మధ్య మాత్రమే ఈ రైళ్లను ప్రవేశపెట్టారు.