రైల్వేలో 2లక్షల ఉద్యోగాలు: వరుస ప్రమాదాలతో భద్రతపై ఫోకస్..
ప్రస్తుతం భద్రతా విభాగంలో దాదాపు 16శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: వరుస రైల్వే ప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ ఫోకస్ చేసింది. ముఖ్యంగా భద్రతా విభాగాల్లో భారీ ఎత్తున ఖాళీలు ఉండటతో.. వాటిని త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది.
భద్రతా విభాగంలో దాదాపు 16శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో రైల్వే ట్రాక్ ల నియంత్రణ, పెట్రోలింగ్ కష్టంగా మారినందునా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాబోయే రోజుల్లో సుమారు 2లక్షల ఉద్యోగాల కల్పనకు రైల్వే చర్యలు తీసుకోనుంది. భద్రతా మరియు నిర్వహణ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాజా నిర్ణయంతో రైల్వే ఉద్యోగుల సంఖ్య 15శాతం మేర పెరిగి 1.5మిలియన్లకు చేరనుంది.
రైల్వే ప్రమాదాల నేపథ్యంలో రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె.మిట్టల్ ఇప్పటికే రాజీనామా చేయగా.. రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాజీనామాకు సిద్దపడ్డారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సమాచారం అందించగా.. పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2016డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం రైల్వే ఉద్యోగాల సంఖ్య 1.3మిలియన్లు ఉండగా, గ్రూప్ సి, గ్రూప్ డి విభాగాల్లో 2,25,823ఖాళీలు ఉన్నాయి.
గడిచిన మూడేళ్లలో ఏటా సగటున 115రైలు ప్రమాదాలు చోటు చేసుకోగా 650మంది మరణించారు. ఈ ప్రమాదాలలో ఎక్కువ శాతం మానవ రహిత రైల్వే క్రాసింగ్ ల వద్దే చోటు చేసుకోవడం గమనార్హం. గత శనివారం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ-హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో కనీసం 21మంది మరణించిన సంగతి తెలిసిందే.