రాజాసింగ్: ‘హిందువులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఇంటిపై బుల్డోజర్‌ ఎక్కిస్తాం’

Click here to see the BBC interactive

హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ చేసిన హెచ్చరిక దుమారం రేపుతోంది.

''యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేలాది సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు తెప్పిస్తున్నారు. ఎన్నికల తర్వాత యోగికి మద్దతు ఇవ్వని ప్రాంతాలన్నింటినీ గుర్తిస్తారు. జేసీబీలు, బుల్డోజర్లు ఎందుకు పనికొస్తాయో తెలుసు కదా''

''యూపీలో ఉండాలంటే యోగి, యోగి అనాల్సిందే. లేదంటే ఉత్తర్‌ప్రదేశ్ వదిలేసి పారిపోవాల్సి ఉంటుంది'' అని రాజా సింగ్ అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొందరు రాజాసింగ్‌పై విమర్శలు చేశారు.

అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు రాజా సింగ్.

https://twitter.com/krishanKTRS/status/1493497568537751553

ఫిబ్రవరి 14 నాటి వీడియోలో ఏముంది?

''ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి కొన్నిచోట్ల భారీగా ఓటింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని ఇష్టపడని వారు భారీ సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు''

''అందుకే మిగతా దశలలో హిందువులు భారీ సంఖ్యలో ఓట్లు వేయాలి. ఎవరైతే యోగికి వ్యతిరేకంగా ఉన్నారో, ఆ ప్రదేశాల వారిని గుర్తించడం జరుగుతుంది. వారందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ఇప్పటికే భారీ సంఖ్యలో బుల్డోజర్లు తరలి వెళుతున్నాయి. వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసు కదా?''

''యూపీలో ఉండాలంటే యోగి, యోగి అనాల్సిందే. లేదంటే ఉత్తర్‌ప్రదేశ్ వదిలేసి పారిపోవాల్సి ఉంటుంది'' అని రాజా సింగ్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

రాజా సింగ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సమయంలోనే మరో వీడియో బయటకు వచ్చింది.

ఫిబ్రవరి 16నాటి వీడియోలో ఏముంది?

''దేశద్రోహులు, ధర్మ ద్రోహులు, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిఒక్కరి ఇంటిపైన బుల్డోజర్ ఎక్కిస్తాం''

''ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇంతకుముందు, తీవ్రవాదం, గుండాలు ఎక్కువగా ఉండే వారు. యోగి వారిని పైకి పంపించారు''

''యోగి ఆదిత్యనాథ్‌కి ఓటు వేయని వారి ఇంటిపై దాడులు చేయడానికి బుల్డోజర్లు, ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి. యూపీలో మరోసారి గెలిచేది యోగినే. దాన్ని ఎవరూ ఆపలేరు'' అని రాజా సింగ్ అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఇదే మొదటిసారి కాదు

రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. రోహింగ్యాలను భారతదేశం నుంచి పంపేయడమే కాదు వారిని చంపేయాలన్నారు ఒకసారి. హైదరాబాద్‌ ఓల్డ్ సిటీని మినీ పాకిస్తాన్ అన్నారు. వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని చెప్పారు.

పద్మావతి సినిమా విడుదలప్పుడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా గుజరాత్ ఘటనలు గుర్తు చేస్తూ మాట్లాడారు.

బీజేపీ ఏమంటోంది?

రాజా సింగ్ వ్యాఖ్యలను బీజేపీ పార్టీ చాలా సందర్భాల్లో ఖండించదు. అలాగని సమర్థించదు.

రాజా సింగ్ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు బీజేపీ దగ్గర ప్రస్తావిస్తే వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప సూటిగా సమాధానం ఇవ్వరు.

''రాజా సింగ్ ఏం చెప్పారో నేను చూడలేదు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా నేను అనుకోవడం లేదు. నేను ఈ విషయంపై స్పందించదలచుకోలేదు'' అని బీబీసీతో చెప్పారు ఆ పార్టీ నాయకులు జి. వివేక్.

''ఆయన ఏ సందర్భంలో ఇలా అన్నారన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది'' అంటూ నర్మగర్భంగా ఆ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకులు రామచంద్ర రావు.

''ఆయన (రాజా సింగ్) ఎవరైనా చేసిన వ్యాఖ్యలకు స్పందించారా, లేకపోతే నిజంగానే తనకు తాను ఆ మాటలు అన్నారా అన్నది కూడా చూడాల్సి వస్తుంది" అని బీబీసీతో చెప్పారు రామచంద్ర రావు.

ఈ విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజా సింగ్ చేసే వ్యాఖ్యలు చాలాసార్లు మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంటాయని బీబీసీతో అన్నారు తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక నాయకుడు.

''కొన్ని సందర్భాలలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నా, ఆయనకున్న ప్రజాదరణ కారణంగా ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో అసలు ఆయనకు రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా వద్దా అని కూడా ఆలోచించినప్పటికీ, మరోసారి కూడా గోషామహల్ నుంచి ఆయన అయితేనే గెలుస్తారన్న ధీమా ఉండడంతో టికెట్ ఇచ్చారు'' అని ఆ నాయకుడు బీబీసీతో అన్నారు.

అయితే ఈ తరహా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు బీజేపీ తరపునే మూడుసార్లు నోటీసులు ఇచ్చినట్టు బీబీసీకి తెలిపారు ఆ పార్టీ నాయకుడు ఒకరు.

"బాధ్యతాయుత రాజ్యాంగ స్థానంలో ఉన్న వారు ఇలా మాట్లాడడం చట్ట వ్యతిరేకం. మతం పేరు మీద ఓటు అడగడం రాజ్యాంగ వ్యతిరేకం. రాజా సింగ్ విడుదల చేసిన ఈ వీడియోపై ఎవరైనా ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లని భయపెట్టడం సరి కాదు. బీజేపీ స్పందించి ఒకవేళ ఇది తప్పు అని వారికి అనిపిస్తే, ఇది తమ సిద్ధాంతం కాదని ప్రజలకి స్పష్టత ఇవ్వాలి" అని చెప్పారు రాజ్యాంగ నిపుణులు మాడభూషి శ్రీధర్.

దేశవ్యాప్తంగా పెరుగుతోన్న ట్రెండ్

ఫ్యాక్ట్‌లీ అనే మీడియా పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం 2015 తరువాత దేశంలో ఇటువంటి విద్వేష ప్రసంగాలు బాగా పెరిగాయి. అంతేకాదు, రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఆ జాబితాలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని ఫ్యాక్ట్‌లీ లెక్కలు చెబుతున్నాయి.

రాజా సింగ్‌పై చర్యలుండవా?

రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చేస్తున్నప్పటికీ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు పెద్దగా కనిపించవు. ఆయన వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ ఆయనపై కేసులు పెడుతుంటారు.

రాజా సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల గురించి ఆరా తీయడానికి బీబీసీ ప్రయత్నించింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.

అటు అధికార టీఆర్ఎస్ కూడా రాజా సింగ్ వ్యాఖ్యలను తేలికగానే తీసుకుంది. ఆయన ఒక కమెడియన్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

https://twitter.com/KTRTRS/status/1493781857074577413

అయితే, టీఆర్ఎస్ నాయకులకు పని లేక ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+