ఉడిపి, కోల్లూరులో రాజస్థాన్ సీఎం ప్రత్యేక పూజలు, చండీయాగం, కర్ణాటక నాయకులతో భేటీ !
బీజేపీ సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కోల్లూరు శ్రీ మూకాంభికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బెంగళూరు: బీజేపీ సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కోల్లూరు శ్రీ మూకాంభికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాజస్టాన్ సీఎం వసుంధరా రాజే విమానంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉడిపి జిల్లా కుందాపుర తాలుకాలోని కోల్లూరు చేరుకున్నారు. తరువాత శ్రీమూకాంభికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమూకాంభికా దేవి ఆలయం పరిపాలన విభాగం అధికారులు సీఎం వసుంధరా రాజేకు స్వాగతం పలికారు.
శ్రీమూకాంభికా ఆలయంలో జరిగిన చండీయాగం, హోమంలో వసుంధరా రాజే పాల్గొన్నారు. అనంతరం రాజస్టాన్ సీఎం వసుంధరా రాజేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం హెలికాప్టర్ లో ఉడిపి చేరుకున్న వసుంధరా రాజే శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
రాజస్టాన్ సీఎం వసుంధరా రాజేకు ఉడిపి మఠం పెజావర పీఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామిజీ ఆలయ సాంప్రధాయ పద్దతిలో స్వాగతం పలికారు. తరువాత ఆలయంలో వసుంధరా రాజే ప్రత్యేక పూజలు చేశారు. వసుంధరా రాజే భేటీ సందర్బంలో కోల్లూరు, ఉడిపిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వసుంధరా రాజేతో కర్ణాటక బీజేపీ నాయకులు భేటీ అయ్యారు.