6 నెలలుగా సచిన్ కుట్రలు.. ఆటోపైలట్ మోడ్లో రాజస్థాన్.. 16న కేబినెట్ రీ-షఫుల్.. సీఎం సంచలనాలు..
రాజస్థాన్ కాంగ్రెస్లో తలెత్తిన ముసలం చివరికి కీలక నేత సచిన్ పైలట్ ఉద్వాసనకు దారితీసింది. పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ చేయనప్పటికీ.. ఆయన నిర్వహిస్తోన్న పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవులను అదిష్టానం లాగేసుకుంది. పదవులు కోల్పోయిన ఆయన.. ''నిజాన్ని కొన్నాళ్లపాటు అణిచివేయగలరేమో గానీ దాన్ని ఓడించలేరు..'' అంటూ తాత్విక ధోరణిలో ట్వీట్ చేశారు. సచిన్ ను పదవుల నుంచి తొలగించిన తర్వాత రాజస్థాన్ కాంగ్రెస్ పూర్తిగా ఆటోపైలట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్కొక్కటిగా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్తో భేటీ..
తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను వెంటేసుకుని ఢిల్లీ వెళ్లిపోయిన సచిన్ పైలట్.. విప్ ను సైతం ధిక్కరిస్తూ సోమ, మంగళవారాల్లో జరిగిన ఎల్పీ సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా హైకమాండ్.. ఆయనను పదవుల నుంచి తొలగించింది. ఆ వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం మధ్యాహ్నం తర్వాత గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసి.. డిప్యూటీ సీఎంగా సచిన్, ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రుల తొలగింపునకు అభ్యర్థించారు. అలాగే, కేబినెట్ రీ-షఫుల్ పైనా చర్చలు జరిపారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు.

సచిన్ చేతుల్లో ఏమీ లేదు..
‘‘నా ఒక్కడికే కాదు, మొత్తం కాంగ్రెస్ కుటుంబానికి ఇది చాలా ఇబ్బందికరమైన నిర్ణయం. చిన్నతనం నుంచి కాంగ్రెస్ లో కలిసిపెరిగిన సచిన్ పైలట్ ను పదవుల నుంచి తప్పించాల్సి రావడం బాధాకరం. కానీ కాంగ్రెస్ లో వ్యక్తుల కంటే పార్టీ, హైకమాండే ప్రధానం. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సచిన్ పైలట్ ఆరు నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. నిజానికి ఇందులో ఆయన పాత్రధారి మాత్రమే. ఆయన చేతుల్లో ఏమీ లేదు. వెనకున్న సూత్రధారులతంతా బీజేపీ నేతలే. సచిన్ వర్గం నిర్వహిస్తోన్న క్యాంపును సెట్ చేసింది కూడా బీజేపీ వాళ్లే అనడానికి పక్కా ఆధారాలున్నాయి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పని చేసిన అదే బృందం రాజస్థాన్ లోనూ చిచ్చుకు ప్రయత్నించింది'' అని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.

16న కేబినెట్ విస్తరణ..
సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు విశ్వేంద్రసింగ్, రమేశ్ మీనాలను పదవుల నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేయనున్నట్లు సీఎం గెహ్లాట్ తెలిపారు. ఈనెల16న కేబినెట్ రీషఫుల్ కు ముహుర్తం నిర్ణయించామని, గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు. సచిన స్థానంలో పీసీసీ చీఫ్ గా గోవింద్ సింగ్ నియమితులయ్యారు. కాగా, సచిన్ పైలట్ వెంట 16 మంది ఎమ్మెల్యేలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా, సీఎం గెహ్లాట్ నేతృత్వంలో జరిగిన సీఎల్పీ భేటీకి 100మందికిపైగా ఎమ్మెల్యేలు వచ్చిచనట్లు తెలుస్తోంది. సచిన్ చీలికతో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బలపరీక్షకు నిలబడాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

రగులుతోన్న రాజస్థాన్.. బలగాల మోహరింపు..
సచిన్ పైలట్ ను పదవుల నుంచి తప్పించిన తర్వాత రాజస్థాన్ అంతటా ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుదీర్ఘకాలం పార్టీలో, ఏళ్లుగా పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతుదారులున్నారు. వారంతా ఆందోళలనకు సిద్ధమవుతున్నారన్న సమచారంతో దౌసా, అజ్మీర్, కోటా, ధోల్పూర్ తదితర జిల్లాల్లో అదనపు బలగాలను మోహరింపజేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే అదననుగా బీజేపీ శ్రేణులు కూడా అల్లర్లకు పాల్పడే అవకాశముందని, సంఘవిద్రోహశక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రియాంక వల్లే సస్పెన్షన్కు బ్రేక్?
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారును కూల్చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ తరహాలోనే రాజస్థాన్ లోనూ అశోక్ గెహ్లాట్ సర్కారును తప్పించేందుకు బీజేపీ స్కెచ్ గీసిందని, భోపాల్ లో పని చేసిన బృందమే, జైపూర్ లోనూ పాగా వేసి ప్రయత్నాలు ఆరంభించిందని, అక్కడ సింధియాను వాడుకున్నట్లే ఇక్కడ సచిన్ ను వాడుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ఆరోపణలపై పోలీసులు.. సచిన్ పైలట్ కు నోటీసులు ఇవ్వడంతో తాజా తిరుగుబాటు ఘటన తెరపైకొచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో సచిన్ పాత్రపై ఆధారాలు ఉన్నప్పటికీ, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, పదవుల నుంచి మాత్రమే తప్పించడం గమనార్హం. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల ప్రమేయం వల్లే పైలట్ పై సస్పెన్షన్ వేటు ఆగిందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications