రాజస్థాన్ సర్వే ఫలితాలు: అసెంబ్లీలో ఓడినప్పటికీ... లోక్సభలో సత్తా చాటనున్న బీజేపీ
ఢిల్లీ: గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజస్థాన్లో బీజేపీ ఓటమిపాలైంది. ఇంకా ఆ చేదు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు బీజేపీ. అంతలోనే 2019 లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరి రాజస్థాన్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది...? ఓటమి నుంచి ఆ రాష్ట్ర బీజేపీ నేర్చుకున్న పాఠాలేంటి..? కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే సత్తా చాటిందో అదే పరిస్థితిని లోక్సభ ఎన్నికల్లో కొనసాగిస్తుందా... సర్వేలు ఏం చెబుతున్నాయి..? ఎలాంటి విశ్లేషణలు ఇస్తున్నాయి.
సర్వేలో సంధించిన ప్రశ్నలు
2019 సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధమవుతోంది. ఇక గతేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో రాజస్థాన్ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరారాజే సర్కార్ను దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నిండింది. ఇక రాజస్థాన్లో పరిస్థితిని అంచన వేసేందుకు న్యూస్ నేషన్ అక్కడ పర్యటించి సర్వే చేసింది. రాజస్థాన్లో మొత్తం 25 లోక్సభ సీట్లున్నాయి. ఇందులో ప్రజలకు పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ ప్రకారంగా స్టాటిస్టిక్స్ తీయడం జరిగింది.
25 సీట్లకు గాను 16సీట్లు కమలం పార్టీవే..!
ఇక సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను పలు అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, అగ్రకులాల పేదలకు 10శాతం రిజర్వేషన్ అమలు, రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్ వంటివి ప్రజలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. న్యూస్ నేషన్ చేసిన సర్వేలో అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి తర్వాత బీజేపీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 25 సీట్లలో బీజేపీకి 16 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 9 సీట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇక ఓటు షేరు అంశానికి వస్తే 40శాతం ఓట్లు బీజేపీకి దక్కనుండగా... కాంగ్రెస్కు 35శాతం ఇతరులకు 10శాతం దక్కే అవకాశం ఉంది. ఇక ప్రధానిగా 2019 ఎవరి పేరును సూచిస్తారన్న ప్రశ్నకు 47శాతం మంది మోడీ పేరు చెప్పగా... 31శాతం మంది రాహుల్గాంధీకి జైకొట్టారు.
రాష్ట్రం ఎదొర్కొంటున్న అతిపెద్ద సమస్యలు
రాష్ట్రంలో అతిపెద్ద సమస్యలు ఏమిటని ప్రశ్నించగా... 16శాతం మంది నిరుద్యోగ సమస్య ఉందని చెప్పారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గిపోతోందని 15శాతం మంది చెప్పగా...అవినీతి రాజ్యమేలుతోందని 12శాతం అభిప్రాయపడ్డారు. డీమోనిటైజేషన్ జీఎస్టీలతో ఇబ్బందులు తలెత్తాయని 8శాతం మంది తెలపగా...ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యను 7శాతం మంది ఎత్తిచూపారు. ఎస్సీ ఎస్టీ చట్టం, ఉగ్రవాదం అంశాలపై 6శాతం మంది స్పందించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మొత్తం 25 లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. 2014 ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 24 వరకు పోలింగ్ జరిగింది. అయితే గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సత్తాచాటింది. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కొత్త జోష్ కాంగ్రెస్లో నిండింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 73 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.