పొరుగింటామె కూతురితో భర్త ఎస్కేప్.. భార్యకు గుండు గీసి..
జైపూర్ : పొరుగింటామె కూతురితో ఓ వివాహిత భర్త లేచిపోయాడన్న కారణంతో.. ఆమెను చెట్టుకు కట్టేసి గుండు గీశారు జైపూర్ లోని అజ్మీర్ గ్రామవాసులు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే జెండా ఆవిష్కరించిన ప్రాంతానికి కి.మీ దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
సదరు వివాహిత భర్త.. పొరుగింటామె కూతురును లేపుకుపోయాడన్న కారణంతో, ఆమె ఇంట్లోకి చొరబడ్డ కొంతమంది మహిళలు బాధితురాలిని జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ గ్రామం నడి మధ్యలోకి ఈడ్చుకు వచ్చారు. అనంతరం ఆమెను ఓ చెట్టుకు కట్టేసి గుండు గీయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గుమిగూడిన మహిళలందరినీ అక్కడి నుంచి చెదరగొట్టి, బాధితురాలిని విడిపించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, మూడు నెలల క్రితం బాధితురాలి భర్త పొరుగుంటామె కూతురిని తీసుకుని గ్రామం నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాలిక ఆచూకీ కనుక్కుని ఆమెను తిరిగి తీసుకొచ్చారు ఆమె కుటుంబీకులు. సదరు వివాహిత భర్త మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే సదరు వివాహితపై దాడి జరగ్గా.. దాడి చేసిన మహిళలు భురి దేవి ఆమె కూతుళ్లు రేష్మా, ఫరీదా, షెహనాజ్, జమునాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం భురి దేవిని, షెహనాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని, తనతో అనేక మందితో సంబంధాలున్నాయని అందుకే ఆమెపై దాడి చేశామని చెబుతున్నారు సదరు నిందితులు.