శ్రీలంకకు రజనీకాంత్: నిర్వాసితులకు ఇళ్లు!, బహిరంగ సభలో ప్రసంగం..
నిర్వాసితులకు కొత్త ఇంటి తాళాలను అందజేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
చెన్నై: శ్రీలంకలోని తమిళ నిర్వాసితుల పురోగతి కోసం పనిచేస్తున్న జ్ఞానం ఫౌండేషన్ సంస్థ తాజాగా వారి కోసం 150ఇళ్లను నిర్మించింది. విశేషమేంటంటే ఈ ఇళ్లను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా అందజేయనున్నారు.
లైకా గ్రూప్ చైర్మన్ కరన్ అల్లిరాజా పేరిట ఏర్పాటు జ్ఞానం ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.22కోట్లతో ఈ ఇళ్లను ఆ సంస్థ నిర్మించింది.2009లో శ్రీలంక అంతర్యుద్దం తర్వాత పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పున:నిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తూ వస్తోంది.
ఇదే క్రమంలో జప్నాలోని తమిళ నిర్వాసితుల కోసం 150 కొత్త ఇళ్లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 9న నిర్వాసితులకు అందజేయనున్నారు. నిర్వాసితులకు కొత్త ఇంటి తాళాలను అందజేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలోను ఆయన పాల్గొనున్నట్లు తెలుస్తోంది.