శ్రీలంక ఎఫెక్ట్: మోడీ ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ నో
న్యూఢిల్లీ/చెన్నై: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కావడం లేదని సమాచారం. మోడీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ, ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స హాజరవుతుండటంతో తమిళనాడులో దుమారం చెలరేగుతోంది. దీంతో, కార్యక్రమానికి హాజరుకాకపోవడమే మంచిదని రజనీ భావిస్తున్నారట.
కాగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఇటీవల ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీకి, రజనీకాంత్కు మధ్య చాలా కాలంగా స్సేహబంధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లినప్పుడు నరేంద్ర మోడీ రజనీకాంత్ను కలిశారు.

అయితే, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడంపై వివాదం చెలరేగుతోంది. తమిళనాడు రాజకీయ పార్టీలు రాజపక్షను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్నాడిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
అలాగే, రాజపక్షను ఆహ్వానించడంపై డిఎంకె అధినేత కరుణానిధి కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాజపక్షను ఆహ్వానించడంపై వైగో తీవ్రంగా దండెత్తుతున్నారు. విజయకాంత్ కూడా రాజపక్షను ఆహ్వానించవద్దని మూడు రోజుల క్రితం కోరారు. ఎల్టిటిఇ అణచివేతలో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో శ్రీలంక తమిళులపై దమనకాండ సాగిందని తమిళనాడు పార్టీలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications