వీడియో: రాజీవ్ గాంధీ హత్యకేసు ప్రధాన నిందితురాలు నళిని జైలు నుంచి విడుదల!
చెన్నై: యావత్ భారత దేశాన్ని వణికించిన రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రధాన నిందితురాలు నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల అయ్యారు. తమిళనాడులోని రాయవేలూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. గురువారం ఉదయం ఆమె పెరోల్పై విడుదల అయ్యారు. 30 రోజుల ఆంక్షలతో కూడిన పెరోల్ను ఆమెకు మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉందని, పెళ్లి ఏర్పాట్లను చేయాల్సి ఉన్నందున తనకు కనీసం ఆరు నెలల పాటు పెరోల్ మంజూరు చేయాల్సిందిగా నళిని మద్రాస్ హైకోర్టును అభ్యర్థించారు.
30 రోజులు బాహ్య ప్రపంచంలో..
దీనికి సంబంధించిన నివేదికలను హైకోర్టు పరిశీలించింది. ఆరు నెలల పాటు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. నెలరోజులకు కుదించింది. 30 రోజుల పాటు ఆమె బాహ్య ప్రపంచంలో ఉండేలా పెరోల్ను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 5వ తేదీన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కొన్ని ఆంక్షలను విధించారు. ఈ నెల రోజుల పాటు నళిని మీడియా ప్రతినిధులతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదని సూచించారు.
జైలు పుట్టి.. లండన్లో నివాసం..
నళిని కుమార్తె పేరు హరిత్ర. నళిని రాయవేలూరు కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న సమయంలో హరిత్ర జన్మించారు. జైలులో జన్మించిన హరిత్రను నళిని తరఫు బంధువులు పెంచి, పెద్ద చేశారు. ఉన్నత చదువులను అభ్యసించిన హరిత్ర ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. కాగా- 28 సంవత్సరాలుగా నళిని జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఓ మహిళ ఇన్ని సంవత్సరాల పాటు కారాగారంలోనే ఉండాల్సి రావడం.. భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే- 30 రోజుల పాటు పెరోల్ లభించడం కూడా నళిని కారాగార శిక్ష చరిత్రలో తొలిసారే కావడం గమనార్హం.
28 సంవత్సరాల తరువాత తొలిసారిగా..
తన 28 సంవత్సరాల కారాగారవాసంలో నళిని పెరోల్పై బయటికి రావడం ఇది రెండోసారి. ఇదివరకు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరు కావడానికి నళిని తొలిసారిగా బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టారు. అది కేవలం 12 గంటలు మాత్రమే. ఈ సారి కుమార్తె వివాహాన్ని దృష్టిలో ఉంచుకుని మద్రాస్ హైకోర్టు నెలరోజులు వర్తించేలా పెరోల్ను మంజూరు చేసింది.
మరణశిక్షను యావజ్జీవంగా బదలాయింపు
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో 1991 మే 21వ తేదీన నిర్వహించిన ఓ ఎన్నికల బహిరంగ సభలో రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. నడుముకు బెల్ట్బాంబు ధరించిన యువతి రాజీవ్ గాంధీకి అతి సమీపం నుంచి తనను తాను పేల్చుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా నళినిని అరెస్టు చేశారు పోలీసులు. 1991 నుంచి ఆమె జైలు జీవితాన్ని గడుపుతున్నారు. నళినితో పాటు ఆమె భర్త మురుగన్, ఏజీ పెరారివలన్, సంతానం, జయకుమార్, రాబర్ట్ పాయస్, రవిచంద్రన్లకు జీవిత ఖైదు విధించారు. నిజానికి వారందరికీ మరణశిక్ష విధించింది న్యాయస్థానం. సోనియాగాంధీ కుటుంబం విజ్ఞప్తి మేరకు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించారు.