Rajiv Gandhi Assassination: జైలులోనే హంతకురాలి నిరాహార దీక్ష
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ వేలూరు జైలులో జీవిత ఖైతు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హత్య కేసులో తాను, తన భర్త 28ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్నామని, కాబట్టి తమను వెంటనే విడుదల చేయాలంటూ జైలులోనే మరోసారి నిరాహార దీక్షకు దిగింది.
శుక్రవారం రాత్రి నుంచి అన్నపానీయాలు ముట్టకుండా వేలూరు మహిళా జైలులో దీక్షచేస్తూ నిరసన చేపట్టారు. ఈ మేరకు జైలు అధికారులకు లేఖ కూడా పంపింది. తాను, తన భర్త మురుగన్ గత 28 ఏళ్లుగా జైల్లోనే ఉన్నామని, ఇకనైనా తమను విడుదల చేయాలని నళిని లేఖలో పేర్కొంది.
కాగా, కుమార్తె వివాహం నిమిత్తం నళిని ఇటీవల కొద్ది రోజులపాటు పెరోల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తన మామ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయనను చూసుకునేందుకు మరో నెల రోజులపాటు పెరోల్ ఇవ్వాలని నళిని కోరింది. మురుగన్ తండ్రి అనారోగ్యంతో భారతదేశానికి వస్తున్నారని, ఆయనను కలుసుకునేందుకు, ఆయనకు సపర్యలు చేయడానికి వీలుగా తనకు నెలరోజులపాటు పెరోల్ మంజూరు చేయాలని నళిని కోరారు.
తమను విడుదల చేయాలంటూ గతంలోనూ తమిళనాడు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. తమకు ఒకే ఒక కుమార్తె ఉందని, ఆమెకు తాము 28ఏళ్లుగా దూరంగా ఉంటున్నామని.. తమను త్వరగా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలంటూ గత సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు ప్రతిపాదన చేసింది. అయితే గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నళిని, ఆమె భర్త మురుగన్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, జైలు అధికారులు సర్దిచెప్పడంతో ఆ దీక్షను విరమించారు. తాజాగా తమను విడుదల చేయాలంటూ దీక్ష చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం, జైలు అధికారులు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.