మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు: విడుదలకు ఓకే, గవర్నర్ తిరస్కరిస్తారు, స్వామి!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన వారిని ఎలా విడిచిపెడుతారు ? అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తిరస్కరిస్తారని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి జోస్యం చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న 7 మందిని విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ కు తమిళనాడు ప్రభుత్వం మనవి చేసింది.
గవర్నర్ ఏం చేస్తారు ?
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆమోదముద్ర వెయ్యాలి. రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చెయ్యాలా ? లేదా ? అనే నిర్ణయం తమిళనాడు గవర్నర్ పరిధిలోకి వెళ్లింది.
ప్రభుత్వం ఒత్తిడికి !
రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంపై మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఒత్తిడికి ఆయన లోంగరని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.
27 ఏళ్లు జైలు జీవితం
రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 27 సంవత్సరాల నుంచి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో నళిని, పెరారివాలన్, మురుగన్, శాంతన్, రాబర్ట్, జయకుమార్, రవిచంద్రన్ లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులోని హంతకులను విడుదల చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ను సుప్రీం కోర్టు వివరణ కోరింది.
క్షమించిన రాజీవ్ ఫ్యామిలీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన వారిని తాము క్షమిస్తున్నామని, వారిని విడుదల చెయ్యాలా ? లేదా ? అనే విషయం చట్టం పరిధిలో ఉందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పటికే చెప్పారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టు అయిన వారు ఇప్పటికే 27 ఏళ్లు జైలు జీవితం అనుభవించారని, వారిని విడుదల చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు పదేపదే తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలకు మనవి చేస్తున్నారు.