జవాను కిరాతర హత్యకు పాక్పై ప్రతీకారం, స్థావరాలను నుగ్గు చేసి, శతఘ్నులతో భారీ దాడి
న్యూఢిల్లీ: పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాను గొంతుకోసి, కిరాతకంగా హతమార్చినందుకు మన ఆర్మీ ప్రతీకారం తీర్చుకుందా? అంటే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ వ్యాఖ్యలను బట్టి అవుననే అర్థమవుతోంది. ఇటీవల సాంబా జిల్లాలోని సరిహద్దుల్లో నరేంద్ర సింగ్ అనే జవాన్ను పాక్ బలగాలు కిరాతకంగా హతమార్చాయి. దీనిపై రాజ్నాథ్ శనివారం స్పందించారు.
పెద్ద ప్రతీకార సంఘటన ఒకటి జరిగిందని, అది ఏమిటన్నది ఇప్పుడు చెప్పలేనని, రెండు, మూడు రోజుల కిందట భారీ ఘటన జరిగిందని, ఏం జరిగిందన్నది భవిష్యత్లో మీరే చూస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి తెలిపారు.
ఎన్ని బుల్లెట్లో లెక్కించొద్దని చెప్పా
ముజఫర్నగర్లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.... పాకిస్థాన్ మన పొరుగు దేశమని, మొదటి బుల్లెట్ను మనం పేల్చవద్దని బీఎస్ఎఫ్ జవాన్లకు చెప్పానని అన్నారు. అటు నుంచి కాల్పులు ప్రారంభమైతే మాత్రం గట్టిగా తిప్పికొట్టాలని, ఎన్ని బుల్లెట్లు కాల్చామో లెక్కించొద్దని చెప్పానని అన్నారు. రాజ్నాథ్ ఎలాంటి ప్రతీకార దాడి జరిగిందో వెల్లడించలేదు.
ధీటుగా స్పందించాం
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేక శర్మ కూడా మాట్లాడుతూ.. మన సైనికుడిని కిరాతకంగా చంపినందుకు ధీటుగా స్పందించినట్లు తెలిపారు. సరిహద్దుల్లో సరైన చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. ఆయన కూడా ఏం చర్య తీసుకున్నామనేది చెప్పలేదు.
శతఘ్నులతో దాడి
మీడియాలో వస్తున్న వార్తల మేరకు... పాకిస్తాన్ పైన భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్స్ తరహా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బీఎస్ఎఫ్ జవాన్ను అత్యంత దారుణంగా గొంతుకోసి చంపినందుకు ప్రతీకారంగా... బార్డర్ ఆవల పాకిస్తాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని శతఘ్నులతో విరుచుకుపడిందట. మన జవాన్లు కురిపించిన గుళ్ల వర్షంలో శత్రు దళాలు కకావికలమయ్యాయి. వారికి భారీగా ప్రాణనష్టం సంభవించింది.
మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ అవసరమని నాడే
ఈ నెల 18న రామ్గఢ్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద దుబ్బుగడ్డిని కత్తిరించడానికి బీఎస్ఎఫ్ గస్తీ బృందం వెళ్లింది. అక్కడ పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపు లేకుండానే వీరిపై కాల్పులు జరిపారు. నరేంద్ర సింగ్ అనే జవాన్ను వారు ఈడ్చుకెళ్లారు. మరుసటి రోజు అతడి మృతదేహం లభించింది. అతడి ఛాతీపై మూడు తూటా గాయాలు అయ్యాయి. గొంతు కోశారు. పాక్కు దీటుగా బుద్ధి చెప్పడానికి మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ అవసరమని సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్థావరాలపై శతఘ్ని దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.