మోడీ జపాన్ పర్యటన: ద్వితీయ స్థానం రాజ్నాథ్దే!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ద్వితీయ స్థానం ఎవరిదన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. నరేంద్ర మోడీ తర్వాతి స్థానం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో గమనిస్తే ఇది వాస్తవమేనని తెలుస్తుంది.
శనివారం నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ బయలుదేరుతున్న నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చే వరకు ప్రభుత్వ వ్యవహారాలు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షించనున్నారు. ఇటీవల ప్రధాని మోడీ బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ రాజ్నాథ్ సింగ్కే మంత్రివర్గ సమావేశం నిర్వహించే బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. జపాన్ పర్యటనకు వెళ్లిన తర్వాత కూడా ఆయనే సీనియర్ మంత్రిగా కేబినెట్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
అంతేగాక శుక్రవారం జమ్మూకాశ్మీర్ పర్యటించాల్సిన హోంమంత్రి రాజ్నాథ్.. మోడీ జపాన్ పర్యటన నేపథ్యంలో తన స్వంత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రధాని దేశంలో లేనప్పుడు హోంమంత్రి ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తాడని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అధికారులకు ఆ స్థాయిలో ఆదేశాలు జారీ చేసే అవకాశం రాజ్నాథ్ సింగ్కే ఉన్నట్లు తెలుస్తోంది.
మే 26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్నాథ్ సింగ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేగాక ప్రస్తుతం లోకసభ డిప్యూటీ నాయకుడిగా రాజ్నాథ్ కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపి అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్.. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇటీవల రాజ్నాథ్ సింగ్పై ఆయన కుమారుడి విషయంలో పలు ఆరోపణలు వచ్చిన సమయంలో ప్రధాని కార్యాలయంతోపాటు బిజెపి అధ్యక్షుడు అమిత్షా కూడా ఆయన తప్పులేదని మద్దతుగా నిలిచారు. అంతకుముందు తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాలను వదులుకుంటానని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.