ఆప్ కో హెచ్చరిక: రాజౌరి ఉప ఎన్నిక.. 23న ఎంసీడీ ఎన్నికల్లోనూ కీలకమే
ఒకవేళ రాజౌరి అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక ఫలితం ఈ నెల 23వ తేదీన జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలకు సెమీ ఫైనల్ అని భావిస్తే అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు మేల్కొలుపు పిలుపు వంటిదే.
న్యూఢిల్లీ: ఒకవేళ రాజౌరి అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక ఫలితం ఈ నెల 23వ తేదీన జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలకు సెమీ ఫైనల్ అని భావిస్తే అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు మేల్కొలుపు పిలుపు వంటిదే. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేయడం ఇదే తొలి సారి కావడం దీనికి కారణం.
పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ తిరిగి తన ప్రభావం కాపాడుకునేందుకు కూడా హెచ్చరిక వంటిదే. రాజౌరి అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికలో బీజేపీ - శిరోమణి అకాలీదళ్ కూటమి మంజిందర్ సింగ్ సిర్సా 40,602 ఓట్లు పొంది విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి చందేలా 25,950 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆప్ అభ్యర్థి హర్జిత్ సింగ్ కేవలం 10,243 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాటల్లో చెప్పాలంటే బీజేపీ - అకాలీదళ్ కూటమి విజయం.. ఢిల్లీ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ ఎంసీడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డార్క్ హార్స్గా ఉన్నదని, పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు సాధించొచ్చునన్నారు.

రాజౌరి ఫలితాలు బీజేపీ శ్రేణులకు నూతనోత్తేజం
అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక ఫలితం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఫలితం వచ్చినందున తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. రాజౌరి ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీ శ్రేణులకు ఉత్తేజాన్నిస్తున్నదని, ఆప్ కార్యకర్తలు ఒకింత వెనుకడుగేయాల్సిన పరిస్థితి ఉన్నదని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత వచ్చిన రాజౌరి స్థాన ఉప ఎన్నిక ఫలితం కంటే ఆప్ కార్యకర్తల నైతిక స్థయిర్యం దెబ్బ తింటున్నదని వ్యాఖ్యానించారు.

ఎంసిడీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా?
ఒక ఎన్నికకు, మరో ఎన్నికకు సంబంధం లేదని ఆప్ నేతలు వాదిస్తున్నారు. 2015 జనవరిలో ఢిల్లీ కంటోన్మెంట్ పాలక మండలికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 36 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ పార్టీ 29 శాతం ఓట్లు వచ్చాయని, కానీ ఆప్కు 24 శాతం ఓట్లే వచ్చాయని, కానీ ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు గెలుచుకుని ఆప్ ఘన విజయం సాధించిందని సీనియర్ ఆప్ నేత ఒకరు చెప్పారు.
అయితే బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వాటా గణనీయంగా పెరుగడం ఆందోళనకరంగా ఉన్నదని ఆప్ లోని ఒక వర్గం నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 2015 ఎన్నికల్లో కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే పొందారని,. కానీ ఇటీవలి ఉప ఎన్నికల్లో అది 33 శాతానికి పెరిగిందన్నారు. దీని ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, బీజేపీ ఆధిపత్యం సాధించేందుకు వీలు చిక్కుతుందని ఆప్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.

ఢిల్లీ రాజకీయాలు భిన్నమంటున్న ఆప్
బహుళ పోటీలున్న ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధిస్తుందని, కానీ ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి త్వరిగతిన పుంజుకోవడం ఊహించలేని అంశమని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఇంతకుముందు సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వారే ఆప్ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని ఆప్ నేతలు చెప్తున్నారు. రాజౌరీ ఉప ఎన్నికలో బీజేపీ తన ఓటు శాతం పెంచుకోవడం ఆప్కు ఆందోళన కలిగిస్తున్నది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే బీజేపీ పరిమితమైంది. 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2015లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా ఆప్కు మద్దతు పలికారు.

రాజౌరి ఫలితంతో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ
గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత ముఖేశ్ శర్మ మాట్లాడుతూ రాజౌరి ఉఫ ఎన్నిక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ముఖాముఖీ పోటీ మాత్రమేనని, రాజకీయంగా ఆప్ పని పూర్తయిందని తేల్చేశారు. ‘ప్రజలు తమ మనోభావాలను బయటపెట్టారు. ఆప్ తీరును వారు తిరస్కరించారు. ఎంసీడీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ముఖాముఖీ పోటీ ఉంటుంది' అని ముఖేశ్ శర్మ చెప్పారు. అయితే బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో నిలిచింది.

ఫలితాలు, హామీలపై ఆప్ ప్రచారం
అధికార ఆప్ తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పున: రూపొందించుకుంటున్నది. 2014లో ప్రభుత్వానికి రాజీనామా చేసిన తర్వాత అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఆప్ అనుసరిస్తున్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సాధించిన విజయాలు, ప్రగతి పైనే ఎంసీడీ ఎన్నికల ఫలితాలు ఆధార పడి ఉంటాయని ఆప్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారం చేయడానికి బదులు తమ ప్రభుత్వ పనితీరును, హామీలను గురించి ప్రచారం చేయాలని ఆప్ నిర్ణయించింది. ఆప్ ప్రభుత్వం నీటి బిల్లును మాఫీ చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే హౌస్ టాక్స్కు మాఫీ చేస్తామని ఆప్ ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాయి.

రెండోసారి భిన్నంగా ఆప్ క్యాంపెయిన్
రెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు ఇప్పుడు ఎమ్సీడీ ఎన్నికల్లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల కోసం పాటించిన వ్యూహాన్నే ఇక పాటించాలని ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవల నిర్ణయించింది. 49 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించుకుని ఆప్ 2015 ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గడనానికి కూడా రెండేళ్లలో ఆప్ ప్రభుత్వం చేసిన పనులను వివరించాలని పార్టీ నిర్ణయించింది.

జర్నైల్ సింగ్ రాజీనామాతో అసలుకే ఎసరు
యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల ద్వారా మోదీ ప్రభజంనం బలంగా ఉన్నందువల్ల ఆయన వ్యతిరేక ప్రచారం చేసినట్లయితే తమకు ఎదురు దెబ్బ తగలవచ్చన్న విషయాన్ని ఆప్ గ్రహించింది. అందుకే ఆప్ నేతలు తమ ప్రచారంలో నరేంద్ర మోదీ పేరెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజోరీ గార్డెన్ ఎన్నికలో ఓటమి తరువాత కూడా ఆప్ నేతలు గతానికి భిన్నంగా వ్యవహరించి జర్నైల్ సింగ్ రాజీనామా కారణంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహమే తమను విజయానికి దూరం చేసిందని పార్టీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications