వెంకయ్య నాయుడు గుస్సా: రాజ్యసభలో దురుసు ప్రవర్తన: ఆ ఎంపీలపై వేటు
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మంది సభ్యులపై వేటు పడింది. వారిని వారం రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు రాజ్యసభ వెల్లడించింది. రాజ్యసభలో పోడియం వైపునకు దూసుకెళ్లడం, వ్యవసాయ బిల్లు కాపీలను చింపి గాల్లోకి విసిరేయడ వంటి చర్యలకు దిగిన సభ్యులపై ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. సభలో ఎవరు అవాంఛనీయంగా ప్రవర్తించినా చర్యలు తప్పవనే సందేశాన్ని పంపించినట్టయింది.
తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎనిమిది సభ్యులు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన డెరెక్ ఒబ్రియాన్, డోలాసేన్, కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, సీపీఎం సభ్యులు కేకే రాగేష్, ఎళమరం కరీమ్లను రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేశారు. వారం రోెజుల పాటు సభకు హాజరు కావొద్దని ఆదేశించారు.

సభ్యులను సస్పెండ్ చేయడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ వ్యవహరించిన తీరు సరికాదంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే మండిపడ్డారు. సభ్యుల సస్పెన్షన్ చట్ట వ్యతిరేకమని విమర్ఇించారు. వ్యవసాయ బిల్లులో పొందుపరిచిన అనేక అంశాలు, సవరణలను సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభకు సూచించారని, అయినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. సభ్యులు వ్యతిరేకిస్తోన్న సమయంలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు ఎలా నిర్ధారించగలరని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications