షీనా హత్య కేసు ఎఫెక్ట్?: రాకేష్ మారియా బదిలీ
ముంబై: షీనా బోరా హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. షీనా కేసులో జరుగుతున్న దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు పదోన్నతి కల్పించారు. ఆయనను హోంగార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన స్థానంలో కమిషనర్గా అహ్మద్ జావేద్ నియమితులయ్యారు. అయితే బోరా హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా కమిషనర్కు పదోన్నతి కల్పించడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.
కాగా, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలంటున్నాయి. ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
ప్రస్తుతం జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్ను ముంబై నగర నూతన కమిషనర్గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు.
అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఇది ఇలా ఉండగా, షీనా హత్య కేసు విచారిస్తున్న మరో ముగ్గురు కీలక అధికారులు కూడా బదిలీ అయ్యారు.