బిగ్ స్టేట్ మెంట్: నాలుగు నెలల్లో రామమందిరం: ఆకాశాన్నంటేలా..నభూతో అనిపించేలా: అమిత్ షా..!
రాంచి: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడించిన తరువాత.. అందరి కళ్లూ రామ మందిరం నిర్మాణం మీదే నిలిచాయి. అయిదు శతాబ్దాలకు పైగా వివాదాల్లో నలుగుతూ, న్యాయస్థానాల్లో నానుతూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం ఎట్టకేలకు సమసి పోవడంతో ఇక- రామమందిర నిర్మాణాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏర్పాట్లు ప్రారంభం..
కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా.. ఈ చర్చలకు తెర దించారు. త్వరలోనే రామమందిరం నిర్మాణాన్ని ఆరంభించనున్నట్లు వెల్లడించారు. కోట్లాదిమంది భారతీయులు కంటున్న కలను త్వరలోనే సాకారమౌతుందని చెప్పారు. నిర్మాణాన్ని చేపట్టిన నాలుగునెలల వ్యవధిలోనే రామ మందిరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇదివరకే ప్రారంభించామని చెప్పుకొచ్చారు.

జార్ఖండ్ ఎన్నికల సభలో..
సోమవారం ఆయన జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా ప్రసంగించారు. ప్రస్తుతం జార్ఖండ్ లో అయిదు విడతల్లో ఎన్నికల పోలింగ్ ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. సోమవారం నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇక అయితో విడత ఒక్కటే మిగిలింది. చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా సోమవారం.. పాకుర్ లో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించారు.

దృష్టి అంతా రామ మందిరంపైనే..
అయిదు శతాబ్దాల పాటుగా వివాదాల్లో నలుగుతూ వచ్చిన అయోధ్యలోని రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటీషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని అన్నారు. దీనితో రామ మందిరం నిర్మాణానికి చట్టపరమైన, న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో- తమ దృష్టి అంతా రామ మందిరం నిర్మాణంపైనే ఉందని అన్నారు.

ఆకాశాన్నంటేలా..
శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంలోనే రామాలయాన్ని నిర్మిస్తామని అమిత్ షా అన్నారు. నభూతో, న భవిష్యత్ అనిపించేలా రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి భారతీయుడు గర్వంగా భావించేలా, తల ఎత్తుకుని చూసేలా.. ఆకాశాన్ని అంటేలా రామ మందిరం నిర్మాణం కొనసాగుతుందని అమిత్ షా చెప్పారు. వందేళ్లుగా రామ మందిరం నిర్మాణం సాకారం కావాలని భారతీయులు కలలు కంటున్నారని, దాన్ని నెరవేర్చబోతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications