కాంగ్రెస్ టార్గెట్: పార్లమెంట్ ముందు ధర్నా
న్యూఢిల్లీ: పార్టమెంట్ సమావేశాల సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేంద్ర సహాయ శాఖ మంత్రి రామ్ శంకర్ కఠారియా ఆగ్రాలో ముస్లీం వర్గీయులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
గురువారం పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ శాఖ మంత్రి రామ్ శంకర్ కఠారియాపై రాజ ద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.

అయితే కేంద్ర మంత్రి రామ్ శంకర్ కఠారియా ఈ విషంపై స్పందిస్తూ ఆగ్రాలో తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. హిందువులు అందరూ సమైక్యంగా ఉండాలనే తాను పిలుపునిచ్చానని వివరించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార పార్టీ నాయకులను ఎలా టార్గెట్ చెయ్యాలని చర్చించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే సమయంలో ఆయనను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారని సమాచారం.












Click it and Unblock the Notifications