తేలలేదు: రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టంపై వీడని సందిగ్ధత
చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు ఎటూ తేలకుండానే ముగిసిపోయేలా ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామ్ కుమార్ సెప్టెంబర్ 18 (ఆదివారం) చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైళ్లో అనుమానాస్ప దస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రామ్ కుమార్ మృతదేహానికి ఇంకా పోస్టు మార్టం నిర్వహించలేదు.
తన కుమారుడి పోస్టుమార్టానికి తమ తరపున ఓ ప్రైవేటు వైద్యుడిని అనుమతించాలని కోరుతూ రామ్కుమార్ తండ్రి పరమశివన సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన దాఖలు చేశారు. ఐటీ ఉద్యోగిని స్వాతి నుంగంబాకం రైల్వేస్టేషన్లో జూన్ 24న అత్యంత దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ కుమార్ జైలులో తనకు కేటాయించిన ప్రత్యేక బరాక్లో కరెంట్ వైర్ను కొరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
19వ తేదీ నుంచి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచిన రామ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపేందుకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈనెల 20వ తేదీన రామ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేలా ఏర్పాట్లు సిద్ధం చేసినా, రామ్ కుమార్ తండ్రి పరమశివన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పోస్టుమార్టం సమయంలో పోస్టుమార్టం వైద్యలు సమక్షంలో జరగాలని కోరారు. ఈ పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు రకాలుగా ఆదేశాలు జారీ చేయడంతో మూడో న్యాయమూర్తి కృపాకరన్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడి సమక్షంలో పోస్టుమార్టం జరిగేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని పరమ శివం, తన న్యాయవాదులు కలిసి పోస్టు మార్టం సమయంలో తమ తరపున వైద్యుడిని అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నామని, అప్పటివరకు రామ్కుమార్ పోస్టుమార్టం నిలిపేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి కృపాకరన్ ఈనెల 30వ తేదీ వరకు రామ్ కుమార్ పోస్టు మార్టం నిర్వహించొద్దని స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
30వ తేదీ లోపు పిటిషనర్ సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురాని పక్షంలో అక్టోబర్ 1వ తేదీన రామ్ కుమార్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం రామ్ కుమార్ తండ్రి పరమశివం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని న్యాయవాదులు తెలిపారు.
అయితే కొన్ని కారణాల వల్ల మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అంగీకరించలేదని తెలుస్తోంది. రెండు రోజుల తర్వాతే ఈ పిటిషన్ విచారణకు వస్తుందని అంటున్నారు.
గతంలో హత్య చేయిబడిన దళితులు గోకుల్ రాజ్, ఇళవరసన్ పోస్టుమార్టం మాదిరిగానే రామ్ కుమార్ది కూడా ఆలస్యమయ్యే సూచననలే కనిపిస్తున్నాయి. 2015 జూన్ 23న ఓ పరువు హత్య నేపథ్యంలో గోకుల్ రాజ్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చి రైల్వే ట్రాక్ సమీపంలో పడేశారు. ఈ కేసులో గోకుల్ రాజ్ మృతదేహానికి వారం రోజుల తర్వాత పోస్టు మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే.