డిఎన్ఎ పరీక్షలో తేలినా రేప్ నిందితుడ్ని వదిలేసిన హైకోర్టు
చెన్నై: పోలీసుల అసమర్థ దర్యాప్తు కారణంగా ఒక మూగ, బధిర మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ వ్యక్తి సంబంధం కారణంగా ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి అతనేనని డిఎన్ఏ పరీక్షలో రుజువయినప్పటికీ మద్రాసు హైకోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. ఆ బిడ్డకు తండ్రి అతనేనని డిఎన్ఏ పరీక్ష ధ్రువీకరించిందని, అయితే అది చాలదని, నేరాన్ని రుజువు చేయడానికి పోలీసులు సక్రమంగా దర్యాప్తు జరపలేదని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి సత్యనారాయణన్ అన్నారు.
ప్రస్తుతం ఈ లోకంలో లేని మహిళపై అత్యాచారం చేసిన సెల్వంను నిర్దోషిగా విడిచిపెట్టారు. పోలీసులు తమ చేతకానితనం, అసమర్థ దర్యాప్తు ద్వారా నిందితుడి నేరాన్ని ధ్రువీకరించలేక పోయారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ బిడ్డకు తండ్రి అతనేనని తేలిందని, అయితే అది సరిపోదని, పోలీసులు కేసును ధ్రువీకరించడానికి సమర్థంగా దర్యాప్తు నిర్వహించలేదని ఆయన అన్నారు.

సెల్వం అపీల్ను అనుమతిస్తూ పోలీసులపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి సోదురుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదురై జిల్లా పోలీసులు నిందితుడిపై ఐపిసి సెక్షన్ 417 (మోసం), సెక్షన్ 376(1) (అత్యాచారం) కింద 1996లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం - సెల్వం బాధితురాలితో పశువులను మేపడానికి వెళ్తూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి అయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిరాకరించినప్పటికీ సెల్వం తనను బలవంతపెట్టి లైంగిక సంబంధం నెరపాడనికి బాధితురాలు అప్పట్లో స్థానిక పంచాయతీకి తెలిపింది.
1996 నవంబర్ 22వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2004 సెప్టెంబర్ 24వ తేదీన గానీ విచారణ ప్రారంభం కాలేదు. ఈలోగా ఫిర్యాదుదారు, అతని తల్లి, కేసు నమోదు చేసి సబ్ ఇన్స్పెక్టర్ మరణించారు. వారిని విచారించలేదు. ఫిర్యాదుదారున్ని పోలీసులు విచారణ జరపలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అతను మరణించాడు కాబట్టి విచారణ జరపలేదని ప్రాసిక్యూషన్ చెప్పడం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందని న్యాయమూర్తి అన్నారు. దర్యాప్తు జరపడానికి రెండేళ్లు ఎందుకు తీసుకున్నారనడానికి వివరణ ఇవ్వలేకపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications