గతంలోను అత్యాచారాలు జరిగాయి, కానీ: బీజేపీ ఎంపీ హేమమాలిని
న్యూఢిల్లీ: మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాల అంశంపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. పెరిగిన మీడియా, సోషల్ మీడియా, ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం కారణంగా చిన్నారులు, మహిళలపై జరుతున్న దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలోను ఇలాంటివి చోటు చేసుకున్నాయన్నారు.
ఈ ఘటనలపై ప్రజలలో చైతన్యం పెరిగిందని, గతంలో కూడా ఇలాంటివి అనేకం జరిగాయని, కానీ వాటి గురించి ఎవరికి తెలియదని, వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వాటికి పరిష్కారం చూపిస్తుందని, ఇలాంటి దుర్ఘటనలు అసలు జరగకూడదని, వాటి వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. కాగా, ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం జరిగితే మరణ శిక్ష విధించనున్నారు. కథువా అత్యాచార ఘటన నేపథ్యంలో ఫోక్సో చట్టానికి కేంద్రం సవరణ చేసింది. చిన్నారులపై అత్యాచార కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరపనున్నారు.
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట చిన్నారులపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజాసంఘాలు, పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అనంతరం చట్ట సవరణ కోసం రాష్ట్రపతికి నివేదించారు.


Click it and Unblock the Notifications