అరుదైన ఘటన: లోకసభలో క్షమాపణ చెప్పిన స్పీకర్
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో క్షమాపణలు చెప్పారు. అంతేగాక, మంగళవారం సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఆమె వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.
‘వాళ్లకు దేశాభిమానం లేదు, కేవలం స్వలాభమే చూసుకుంటారు' అని మంగళవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభలో అన్నారు. డీడీసీఏ వ్యవహారంలో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం వెల్లోకి దూసుకొచ్చి నిరసన చేస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందిన బీఎస్ఎఫ్ ఇంజినీర్లకు బుధవారం సభలో సంతాపం తెలిపిన తర్వాత.. కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే ఆ అంశాన్ని లేవనెత్తారు. స్వప్రయోజనం అంటూ స్పీకర్ అలా మాట్లాడటం సరైంది కాదని ఖర్గే తమ నిరసన వ్యక్తం చేశారు. తమ మనోభావాలను స్పీకర్ దెబ్బతీశారని ఖర్గే అన్నారు.

దీనిపై స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఏ పార్టీ పేరు చెప్పలేదని, తప్పకుండా స్వప్రయోజనం అన్న వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక, అందుకు తనను క్షమించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు.
కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ వారిని బాధపడినట్లే.. కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన కూడా మరికొందరిని బాధించేలా ఉంటుందని, అది కాంగ్రెస్ సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవర్తన సరిగా లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సభలో స్పీకర్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.












Click it and Unblock the Notifications